ధర్మపురికి వెళితే యమపురి ఉండదట.. కారణమేంటంటే..

ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహ ఆలయం నవనారసింహ క్షేత్రాల్లో ఒకటి. దక్షిణాభిముఖంగా ప్రవహించే గోదావరి నదీతీరంలో లక్ష్మీనరసింహ స్వామి వారు వెలిశారు. ఈ ఆలయం దక్షిణ కాశీగా విరాజిల్లుతోంది. ఇక తీర్థ రాజంగానూ.. హరిహరక్షేత్రంగానూ భాసిల్లుతోంది. దేశంలో ఎక్కడా కనిపించని విశేషం ఇక్కడ ఒకటి కనిపిస్తుంది. అదేంటంటే.. స్వామివారి ఆలయ ప్రాంగణంలో యమ ధర్మరాజు కోవెల ఉంది. ఈ కారణంగానే ధర్మపురి వస్తే యమపురి ఉండదని పెద్దలు చెబుతారు. యోగానంద రూపుడై భాసిల్లుతున్న స్వామివారి విగ్రహాన్ని సాలగ్రామ శిలతో తయారైంది.

ధర్మపురి స్వామివారిని తలచినంతనే దుఃఖాలన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఇక స్తలపురాణం ప్రకారం.. ధర్మవర్మ అనే మహారాజు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పాలించడం వల్లే ధర్మపురి అనే పేరు వచ్చింది. అయితే ఈ ఆలయం బహమనీ సుల్తానులు చేసిన దండయాత్రలో ధ్వంసమైంది. ఈ ఆలయానికి వేయి సంవత్సరాల చరిత్ర ఉంది. తిరిగి ఈ ఆలయాన్ని 17వ శతాబ్దంలో పునరుద్ధరించారు. సత్యవతీదేవి పామునే పతిగా పొందిన అనంతరం ఎన్ని ఆలయాలు తిరిగినా ఫలితం దక్కకపోవడంతో ధర్మపురికి వచ్చి స్వామివారిని దర్శించుకుని గోదావరిలో స్నానమాచరించగానే భర్తకు పాము రూపం పోయి సుందర రూపం వచ్చిందట.

Share this post with your friends