తిరుప్పన్‌కుండ్రంలో షణ్ముఖుని విగ్రహం ఎలా ఉంటుందంటే..

తమిళనాడులోని మధురై అమ్మవారి క్షేత్రానికి 9 కి.మీ దూరంలో తిరుప్పరంకుండ్రం ఉంటుందని తెలుసుకున్నాం కదా. ఈ ఆలయం అద్భుత శిల్పకళకు ప్రసిద్ధిగాంచింది. ఈ ఆలయాన్ని పాండ్యుల కాలంలో నిర్మించారని శాసనాలు చెబుతున్నాయి. కొన్ని ఆధారాలు మాత్రం ఈ ఆలయం పాండ్యుల కాలాని కన్నా ముందు నుంచే ఉందని చెబుతున్నాయి. ఈ ఆలయాన్ని కొండను తొలిచి నిర్మించారు. దేవతా విగ్రహాలన్నీ ద్రవిడ శిల్పకళకు నిదర్శనంగా అద్భుతంగా చెక్కి ఉన్నాయి. ముఖ్యంగా ఆలయంలోని మూల విరాట్టు అయిన షణ్ముఖుని విగ్రహం మరింత అద్భుతంగా ఉంటుంది.

తిరుప్పరంకుండ్రంలో గర్భాలయంలో స్వామి కూర్చుని ఉన్న భంగిమలో దర్శనమిస్తాడని ముందుగానే తెలుసుకున్నాం కదా. ఇతర షణ్ముఖ క్షేత్రాలన్నింటిలో సుబ్రహ్మణ్య స్వామి నిలుచుని ఉన్న భంగిమలో దర్శనమిస్తాడు. తిరుప్పరంకుండ్రంలో సుబ్రహ్మణ్యస్వామి ఆసీనుడై చక్కగా చిరునవ్వులు చిందిస్తూ భక్తులకు దర్శనమిస్తాడు. దేవలోకాధిపతి ఇంద్రుడు తన కుమార్తె దేవసేనను సుబ్రహ్మణ్యునికిచ్చి వివాహం జరిపించిన ప్రదేశం ఈ క్షేత్రం కాబట్టి ఇక్కడ సుబ్రహ్మణ్యస్వామి దేవసేన సమేతుడై కొలువుదీరాడు. స్వామివారి చుట్టూ నారద మహర్షి, ఇంద్రుడు, బ్రహ్మ, సరస్వతి, సూర్యచంద్రులు, గంధర్వులంతా కొలువుదీరి ఉంటారు.

Share this post with your friends