శ్రీకృష్ణుడు అవతారాన్ని చాలించాక ఆయన హృదయం ఎక్కడకు చేరిందంటే..

శ్రీకృష్ణ పరమాత్ముడి హృదయం పూరిలో ఉందని చెబుతారు. అసలు కన్నయ్య హృదయం పూరికి ఎలా చేరుకుందో తెలిపే కథ ఇది. శ్రీకృష్ణుడికి కురుక్షేత్ర యుద్ధానంతరం తన వంద మంది కుమారులు నేలకొరగడాన్ని చూసిన గాంధారి శపించింది. కృష్ణుడి యాదవ వంశమంతా అంతరించి పోవాలని శాపం ఇచ్చింది. అలా యాదవ వంశం అంతరించి పోగా.. బలరాముడు, శ్రీకృష్ణుడు మాత్రమే మిగిలారు. అనంతరం ఆదిశేషువు సైతం బలరామ అవతారాన్ని వీడి బయటకు రావడాన్ని చూసిన శ్రీకృష్ణుడు తను కూడా అవతారం చాలించే తరుణం ఆసన్నమైందని గ్రహించాడు. అప్పుడే కన్నయ్యను చూసి జర అనే ఓ బోయవాడు జింకనుకుని పొరబడి బాణాన్ని సంధిస్తాడు. ఆతరువాత అది జింక కాదని.. శ్రీకృష్ణుడని తెలుసుకుని కలత చెందుతాడు.

అప్పుడు అది నీ తప్పిదం కాదని.. పూర్వ జన్మ ఫలితమని బోయవాడికి శ్రీకృష్ణుడు చెబుతాడు. మరోవైపు అర్జనుడు సైతం శ్రీకృష్ణుడిని చూసి తీవ్ర ఆవేదనకు గురవుతాడు. తను తనువు చాలించిన అనంతరం తన దేహానికి అంతిమ సంస్కారం చేయాలని అర్జనుడికి శ్రీకృష్ణుడు చెప్పి తన అవతారాన్ని చాలిస్తాడు. అనంతరం అర్జనుడు.. శ్రీకృష్ణుడి దేహాన్ని దహనం చేయగా.. ఒక్క హృదయం మినహా అంతా దహనమవుతుంది. హృదయం మాత్రం నీలి రంగులో ఒక ప్రకాశవంతమైన మణిలా కనిపిస్తుంది. దానినే బ్రహ్మ పదార్థం అంటారు. దానిని ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్న అర్జనుడికి శ్రీకృష్ణుడు కలలో కనిపించి ఒక వేప దుంగకి తన హృదయాన్ని కట్టి సముద్రంలో వదిలేయమని చెప్పాడు. అలా ద్వారక వద్ద నున్న సముద్రం నుంచి పూరి నగరానికి కన్నయ్య హృదయం చేరుకుందని చెబుతారు.

Share this post with your friends