
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన సోమవారం రాత్రి జరిగిన సర్వభూపాల వాహన సేవలో 20 బృందాలు, 527 మంది కళాకారులు తమ తమ కళాకృతులతో స్వామి వారిని ఆటలతో పాటలతో సేవించున్నారు. ఇందులో మనం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల కళా బృందాలతో పాటు, జార్ఖండ్, కేరళా, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రల నుంచి వచ్చిన కళా బృందాలు ప్రదర్శించిన తీరు భక్తులను సంబ్రమాశ్చర్యాలతో, భక్తిరసాన్ని నింపాయి.
తిరుపతికి చెందిన శ్రీవేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల విద్యార్థులచే భరతనాట్యం, కూచిపూడి నృత్యాలు, హైదరాబాద్ నుంచి వచ్చిన గణేశ్ బృందం కొమ్ము కోయ, గోండు నృత్యం, వికారాబాద్ నుంచి వచ్చిన అశోక్ బృందం ప్రదర్శించిన కోయ నృత్యం, రాజమండ్రికి చెందిన కె.రాణి బృందం కేరళ డ్రమ్స్, కడపకు చెందిన సి.బాబు బృందం ప్రదర్శించిన డప్పుల విన్యాసాలు, బెంగళూరుకు చెందిన దీప్తి బృందం ప్రదర్శించిన కృష్ణామృత కల్పమ్ రూపకం, గురువాయూర్ కు చెందిన పి.టి.చంద్రన్ బృందం ప్రదర్శించిన తిరువట్టకాళి అనే ప్రదర్శన, జార్ఖండ్ కు చెందిన రూప్ సింగ్ బృందం ప్రదర్శించిన ఛండాలి నృత్యం, గుంటూరుకు చెందిన విజయలక్ష్మి ప్రదర్శించిన కాశ్మీరీ నృత్యం రెండు కళ్ళు చాలవు అన్నట్లు సాగింది. తమిళనాడుకు చెందిన సంధ్య బృందం ప్రదర్శించిన భరతనాట్యం, విశాఖపట్నం, శ్రీకాకుళం, తిరుపతి పట్టణాలకు చెందిన కోలాట బృందాలు ప్రదర్శించిన తీరు భక్తులను ఎంతగానో అలరించాయి.
