శ్రీ మహావిష్ణువు దశావతారములలో “కూర్మావతారం” రెండవది. శ్రీ మహావిష్ణువు దశావతారాలను దుష్ట శిక్షణ కోసం దాల్చాడని చెబుతారు. కానీ వాటిలో కూర్మావతారం మాత్రం దుష్ట శిక్షణ కోసం దాల్చలేదు. ఈ అవతారంలో రాక్షస సంహారము లాంటివి, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ లాంటివి లేకపోయినా, ఒక విశిష్ట ప్రయోజనం కోసం అవతరించినదే ఈ కూర్మావతారం. పూర్వము దేవతలు “దూర్వాస మహర్షి” శాపముతో దానవులతో జయించబడి రాజ్యాన్ని పోగొట్టుకొని అసురుల వేధింపులకు తాళలేక ఇంద్రాది దేవతలు బ్రహ్మతో కలిసి “శ్రీ మహా విష్ణువు”ని ప్రార్థించారు.

కరుణాంతరంగుడైన శ్రీహరి అమృతోత్పాదన యత్నాన్ని సూచించాడు. ఆ మేరకు “ఇంద్రుడు” దానవులను కూడా సాగర మథనానికి అంగీకరింపజేశాడు. దేవదానవులు “మందరాన్ని” కవ్వంగా తెచ్చి “వాసుకి”ని తాడుగా చేసుకున్నారు. పాముకు విషం తలభాగంలో ఉంటుంది. అది మృత్యు స్వరూపం. రాక్షసులు తామసులు, తమస్సు పాపభూయిష్ఠం. దాన్ని అణచివేస్తే తప్ప లోకంలోనైనా, మనసులోనైనా ప్రకాశం కలగదు. అందుచేత శ్రీహరి రాక్షసుల్ని మృత్యు స్వరూపమైన వాసుకి ముఖం వద్ద నిలిపాడు. క్షీరసాగర మధనంలో- బరువుగా ఉండి కింద ఆధారం లేకపోవడంతో పర్వతం సముద్రంలో మునిగిపోయింది. అప్పుడు శ్రీహరి బ్రహ్మాండాన్ని తలపించే పరిమాణంలో సుందర “కూర్మ” రూపంలో మహావిష్ణువు అవతరించాడు. పాలసముద్రంలో మునిగిపోయిన మందర పర్వతాన్ని పైకెత్తి తన కర్పరంపై నిలిపాడు. ఇది కూర్మావతార కధగా ప్రసిద్ధికెక్కినది.
