ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవది శ్రీశైలం. భూలోకంలో కైలాసంగా శ్రీశైలం ప్రఖ్యాతిగాంచింది. శ్రీశైలాన్ని దర్శించినంత మాత్రాన మోక్ష ప్రాప్తి కలుగుతుందని చెబుతారు. శ్రీశైలంలో శివుడు మల్లికార్జున స్వామిగానూ.. పార్వతీ దేవి.. భ్రమరాంబికా వెలసి ఉన్నారు. పార్వతీ మాతను భ్రమరాంబికా దేవి అని ఎందుకు అంటారో తెలుసుకుందాం.

పూర్వం అరుణాసుడు అనే రాక్షసుడు చాలా కాలం పాటు గాయత్రీ మంత్రం జపిస్తూ బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేసి.. రెండు కాళ్లు, నాలుగు కాళ్ల ప్రాణులతో మరణం లేకుండా వరం పొందాడు. వర ప్రభావంతో అరుణాసురుడు చేయని ఆగడాలు లేవు. దేవతలను సైతం హింసించసాగాడు. ఆ రాక్షసుని ఆగడాలకు భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రార్థించగా.. అమ్మవారు ప్రత్యక్షమై అరుణాసురుడు తన భక్తుడని.. గాయత్రీ మంత్రం జపిస్తున్నంత వరకు అతన్ని ఎవరూ ఏమీ చేయలేరని చెబుతుంది. దీంతో దేవతలంతా కలిసి దేవగురువు బృహస్పతిని అరుణాసురుని దగ్గరికి పంపిస్తారు.
అరుణాసురుడు దేవ గురువు బృహస్పతిని చూసి ఆశ్చర్యపోయాడు. అది గ్రహించిన బృహస్పతి.. అరుణాసురునితో మనమిద్దరం ఒకే అమ్మవారిని గాయత్రీ మంత్రంతో పూజ చేస్తున్నాం కాబట్టి తన రాకలో వింతేమి లేదని చెబుతాడు. అందుకు అరుణాసురుడు అహంకారంతో మీరంతా పూజించే అమ్మవారిని ఇకపై తాను పూజించనని చెప్పాడు. అప్పటి నుంచి గాయత్రి మంత్రం జపాన్ని మానేశాడు. దానికి కోపించిన ఆదిశక్తి భ్రమర రూపం ధరించి అసంఖ్యాకంగా భ్రమరాలని సృష్టించి అరుణాసురుడితో పాటు అతని సైన్యాన్ని సంహరించింది. అందుకే శ్రీశైలంలోని అమ్మవారు భ్రమరాంబికా దేవిగా మారింది.
