ప్రఖ్యాత పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో బోర్డు ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. అలాగే టీటీడీ తరహాలోనే ధర్మకర్తల మండలి ఏర్పాటుకు రూపొందించిన ముసాయిదాలో పలు మార్పులను సైతం రేవంత్ సూచించారు. తాజాగా ఆయన యాదగిరి గుట్ట బోర్డు నియామక నిబంధనలపై సమీక్ష నిర్వహించారు.
తిరుమలలో మాదిరిగానే యాదగిరిగుట్ట ఆలయం సమీపంలో రాజకీయాలకు తావు లేకుండా చూడాలని, ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు రేవంత్ సూచించారు. ఈ క్రమంలోనే ఆలయం తరుఫున చేపట్టాల్సిన పలు ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలపై ముసాయిదాలో అధికారులు పేర్కొన్న నిబంధనల విషయంలో రేవంత్ పలు మార్పులు సూచించారు. త్వరలోనే టీటీడీ తరహాలోనే యాదగిరి గుట్టకు సైతం ధర్మకర్తల మండలి ఏర్పాటు కానుందని తెలుస్తోంది.