తమిళనాడులోని జిల్లా కేంద్రమైన తిరుమీయాచ్చూర్కు సుమారు 25 కిలోమీటర్ల దూరంలో లలితాంబికా క్షేత్రం గురించి ఇప్పటికే చాలా విషయాలను తెలుసుకున్నాం కదా.. ఇక మరో ఆసక్తికర విషయం గురించి తెలుసుకుందాం. అదేంటంటే.. లలితా సహస్ర నామావళి పుట్టింది ఇక్కడేనని చెబుతారు. పురాణాల ప్రకారం భండాసురుడనే రాక్షసుడు తనకు లభించిన వర గర్వంతో సాధారణ ప్రజలనే కాకుండా రుషులు, దేవతలను సైతం హింసిస్తూ ఉండేవాడు. వారంతా వెళ్లి జగన్మాత అయిన పార్వతీ దేవి వద్ద తమ బాధలను చెప్పుకున్నారట.

అప్పుడు జగన్మాత రుషులు, దేవతల బాధలను తీర్చేందుకు యజ్ఞగుండం నుంచి శ్రీచక్ర రథంపై ఆసీనురాలై లలితాంబిక అనే నామధేయంతో ఆవిర్భవించింది. ఆ సమయంలో ఉగ్ర స్వరూపిణిగా జగన్మాత ఉందట. దీంతో జగన్మాతను పరమశివుడు భూలోకానికి వెళ్లి ‘మనోన్మణి’ పేరుతో తపస్సు చేయమని ఆదేశించాడు. శివుని ఆదేశం మేరకు జగన్మాత ఈ క్షేత్రానికి వచ్చి తపస్సు చేసిందట. ఆ తరువాత ఇక్కడే ప్రసన్న రూపంలో కొలువుదీరింది. ఆ సమయంలో వశిన్యాది వాగ్దేవతలంతా అమ్మవారిని స్తుతిస్తూ మొట్టమొదటిసారిగా “శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాన్ని” ఇక్కడే పఠించారు.
