తిరుమలలో చెప్పుకోవల్సిన మరో దివ్య తీర్థం.. పాండవ తీర్థం. ఇది తిరుమల నుంచి 2.5 కిలోమీటర్ల దూరంలో శ్రీవారి ఆలయానికి తూర్పున పాపవినాశనం వెళ్లే మార్గంలో ఉంటుంది. దీనిలో స్నానమాచరించడం వల్ల, సకల పాపాలు నశించడమే కాకుండా అన్ని విధాలుగా విజయం సిద్ధిస్తుందట. ఈ విషయాన్ని వేంకటాచల మహత్స్యం చెబుతోంది. ఈ పాండవ తీర్థంలో పాండవులు ఏడాదిపాటు స్నానమాచరించినట్టు సైతం వివరిస్తోంది. పాండవులు స్నానమాచరించిన కారణంగానే దీనికి పాండవ తీర్థమని పేరు వచ్చింది. ఇక్కడ ఏడాది పాటు స్నానమాచరించినందునే పాండవులకు సమర విజయం, రాజ్య ప్రాప్తి కలిగిందని వరాహపురాణం వివరిస్తోంది.

ఇక తిరుమలలో చెప్పుకోవల్సిన తీర్థాలలో మరొకటి చక్ర తీర్థం. తిరుమల కొండపై శ్రీవారి శిలాతోరణం అందరికీ తెలిసిందే. నిజంగానే ఇక్కడ మనకు రాతి తోరణం స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సమీపంలోనే చక్ర తీర్థం ఉంది. దీని ప్రత్యేకత ఏంటంటే.. శ్రీవారి సుదర్శన చక్రం ఇక్కడ పడిపోయిందట. దీంతో అది చక్రతీర్థంగా వెలిసిందని స్కాంద పురాణం వివరిస్తోంది. ఈ చక్ర తీర్థం విశేషం ఏంటంటే.. దీని జలాల్లో ఒక్క చుక్క మన శిరసుపై పడినా కూడా అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు తరిస్తాయని పురాణవచనం. తిరుమలలో చెప్పుకోవల్సిన తీర్థాలలో మరొకటి కుమారధార. ఇది శ్రీవారి ఆలయానికి వాయువ్య దిశలో దాదాపు 7 కి.మీ దూరంలో ఉంటుంది. ఇక్కడ ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు కుమార తీర్థ ముక్కోటిని నిర్వహిస్తారు.
