
హిమాచల్ప్రదేశ్లోని కులు లోయలో దసరా వేడుకలను అత్యంత వైభవంగానూ.. విభిన్నంగానూ నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడి వేడుకలను చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. ఈ పండుగ ఈనాటిది కాదని తెలుసుకున్నాం కదా. 375 ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది.
17వ శతాబ్దంలో కులు రాజు జగత్ సింగ్ ఈ వేడుకను ప్రారంభించారు. ఒక పురాణం ప్రకారం దురాశతో అప్పటి కులు రాజు జగత్సింగ్ను సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఆయనను ఒక బ్రాహ్మణ కుటుంబం శపించిందట.
ఆ శాపం కారణంగా అతని ఆరోగ్యం క్షీణించి.. ప్రశాంతత లేకపోవడంతో విపరీతంగా బాధపడ్డాడట. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆయన కోలుకోలేదట. అప్పుడు ఒక ఋషి శ్రీరాముడి ఆశీస్సులు పొందమని రాజు జగత్ సింగ్కు సలహా ఇచ్చాడు. అప్పుడు జగత్సింగ్ రాముల వారి విగ్రహాన్ని దసరా పండుగ నాడు ప్రతిష్టించి కులు లోయలో కొలువైన దేవతలందరికీ ఆహ్వానం పలికాడు. అప్పటి నుంచి ఈ సంప్రదాయం ప్రారంభమైంది. ఏడు రోజుల పాటు ఈ పండుగను అత్యంత వైభవంగా నిర్వహించుకుంటారు. ప్రతి ఏటా ఈ ఏడు రోజుల పండుగను వీక్షించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడకు వస్తుంటారు.
