శ్రీవారి వక్షస్థలంపై వ్యూహలక్ష్మీదేవి ఎలా ఉంటుందంటే..

తిరుమలలోని శ్రీ మలయప్ప స్వామివారికి శంఖు, చక్రాలను ఏర్పాటు చేశారు. ఆపై పచ్చ కర్పూరంతో తిరునామం పెట్టారు. చివరిగా వక్షస్థలంలో వ్యూహ లక్ష్మీ ప్రతిమను ఏర్పాటు చేశారట. ఈ విషయాన్ని స్కంద పురాణంలో వెంకటాచల మహత్యం వివరిస్తోంది. శ్రీవారి వక్షస్థలంలో వ్యూహలక్ష్మి అమ్మవారు ఉంది కాబట్టే అమ్మవారికి ప్రీతికరమైన శుక్రవారాల్లో శ్రీమన్నారాయణునికి అభిషేకం నిర్వహించాలని నిర్ణయించారట. అయితే ఈ కార్యక్రమాన్ని కూడా రామానుజులవారు ఆరంభించారని శిలాశాసనాల్లో పేర్కొన్నారు. ఇది మాత్రమే కాకుండా స్వామివారికి సేవలందించేందుకు జీయంగార్ వ్యవస్థను సైతం ఏర్పాటు చేశారు.

శ్రీవారి కైంకర్యం కోసం తొలి జీయర్ మఠాన్ని కూడా ఆనాడే స్థాపించారు. నాటి నుంచి నేటి వరకూ ఈ సంప్రదాయం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. శ్రీవారి వక్షస్థలంలో వ్యూహ లక్ష్మి అమ్మవారు ఉన్న కారణంగానే తిరుమలకు ఇంతలా భక్తజనం, అలాగే అమితంగా ధనాకర్షణ కలుగుతోందని చెబుతారు. సాధారణంగా లక్ష్మీదేవి ఆలయాల్లో అమ్మవారు చతుర్భుజాలతో దర్శనమిస్తుంది. అయితే శ్రీవారి వక్షస్థలంలో మాత్రం మూడు భుజాలతోనే అమ్మవారు దర్శనమిస్తుంది. అందుకే వ్యూహలక్ష్మీదేవిని త్రిభుజ అని కూడా పిలుస్తారు. ఇదే అమ్మవారు వేరే ఏదైనా ఆలయంలో నాలుగు భుజాలతో పద్మంలో కూర్చొని మనకు దర్శనమిస్తుంది.

Share this post with your friends