తిరుమలకు వచ్చే యాత్రికుల ఆరోగ్య భద్రతకు టీటీడీ పెద్దపీట వేస్తోందని ఈవో శ్రీ జె. శ్యామలరావు చెప్పారు. తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవనం సమీపంలో ఉన్న బాలాజీ భవన్ హోటల్ను ఫుడ్ సేఫ్టీ విభాగం (ఎఫ్ఎస్డి) అధికారుల బృందంతో కలిసి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈవో, ఎఫ్ఎస్డి డైరెక్టర్ శ్రీ పూర్ణచంద్రరావుతో కలిసి హోటల్లో తయారు చేస్తున్న ఆహార పదార్థాలు, ముడి సరుకుల నిల్వ, శుభ్రపరచడం తదితర పద్ధతులను పరిశీలించారు. బంగాళదుంపలు, కాలీఫ్లవర్ మరియు కొన్ని కిరాణా సామాగ్రితో సహా చాలా కూరగాయలు కుళ్ళిపోయినట్లు వారు గుర్తించారు. పరిశుభ్రత, పారిశుద్ధ్య చర్యలు కూడా నాసిరకంగా ఉన్నాయన్నారు.
అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ, కొందరు శ్రీవారి భక్తులు తిరుమల హోటల్లో భోజనం చేసి అస్వస్థతకు గురయ్యారని, యాత్రికుల నుంచి వరుసగా వచ్చిన ఇ- మెయిల్ల ఫిర్యాదుల నేపథ్యంలో తాను ఎఫ్ఎస్డి బృందంతో కలిసి హోటల్ను ఆకస్మికంగా తనిఖీలు చేశామని చెప్పారు. హోటల్ నిర్వాహకులు ఆహార భద్రతా నిబంధనలను పాటించడం లేదని, అపరిశుభ్రత పరిస్థితుల మధ్య హోటల్లో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లు తెలిపారు. తిరుమలలోని హోటల్ లు పరిశుభ్రమైన మరియు రుచికరమైన ఆహార ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో, భవిష్యత్తులో ఇలాంటి దాడులు మరిన్ని నిర్వహించనున్నట్లు తెలియజేశారు. హోటల్లోని తినుబండారాల తయారీలో నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని పునరుద్ఘాటించారు.
అనంతరం ఎఫ్ఎస్డి డైరెక్టర్ మాట్లాడుతూ, తనిఖీలలో ఈ హోటల్లో పూర్తిగా ఆహార భద్రతా నిబంధనలను పాటించడం లేదని తేలిందన్నారు. హోటల్లో కుళ్ళిన కూరగాయలు, ముందు రోజు తయారు చేసిన ఆహారం, పలుమార్లు ఉపయోగించిన నూనె, ఎఫ్ఎస్డి నిబంధనలకు విరుద్ధమైన రంగు, రుచి పెంచే ముడి పదార్థాలను ఉపయోగిస్తున్నట్లు మా తనిఖీలో గుర్తించామని ఆయన చెప్పారు. ఇక్కడి వంటగదిని వెంటనే మూసివేస్తామని, క్షుణ్ణంగా విచారణ జరిపిన తర్వాత, హోటల్పై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మొబైల్ ల్యాబ్ ప్రారంభం:
అనంతరం ఎఫ్ఎస్డి డైరెక్టర్తో కలిసి ఈవో మొబైల్ ల్యాబ్, “ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్”ను ప్రారంభించారు. ప్రత్యేకమైన ఈ వాహనం ఆహారం మరియు నీటి నాణ్యతను తనిఖీ చేయడానికి అవసరమైన పరికరాలతో కూడిన ల్యాబ్ను కలిగి ఉంది. ఈ మొబైల్ ల్యాబ్లో 80 రకాల పదార్థాల నాణ్యతలను తనిఖీ చేస్తారు. దీనిని ప్రత్యేకంగా తిరుమలలో ఆహారం, నీరు నాణ్యత ప్రమాణాలను పరిశీలించేందుకు వినియోగిస్తారు.