కొన్ని ఆలయాలను మన జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని అంటారు. వాటిలో ప్రధానమైన ఐదు దేవాలయాలను గురించి మనం తెలుసుకుందాం.
తిరుమల : కలియుగ వైకుంఠం తిరుమల. ఇక్కడి శ్రీ వేంకటేశ్వర స్వామివారిని భక్తులు తమ ఇష్టానుసారంగా మలయప్ప స్వామి, వెంకన్న, బాలాజీ, శ్రీవారు అంటూ పిలుచుకుంటారు. దేశంలోనే అత్యంత సంపన్న దేవుళ్లలో ఒకరు.. భక్తులు కోరిన కోరికలు తీర్చే స్వామివారిని రోజుకు దాదాపు లక్ష మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. అత్యంత రద్దీ క్షేత్రాల్లో ఇదొకటి.
వారణాసి (కాశీ) : ఇక , ఉత్తరప్రదేశ్లోని వారణాసి గురించి హిందువులకు తెలియకుండా ఉండదు. పవిత్రమైన గంగా నది ఒడ్డున ఉందీ కాశీ నగరం. కాశీలో కొలువైన విశ్వేశ్వరుడిని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని అంటారు. ఇక్కడ చాలా ఆలయాలున్నాయి. హిందువులు ఈ నగరాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తుంటారు. ఇక్కడి దశాశ్వమేధ ఘాట్లో ప్రతిరోజూ సాయంత్రం జరిగే గంగా హారతి వేడుకను చూడడం ఓ మరచిపోలేని అనుభూతిని ఇస్తుంది.
రిషికేశ్ : గంగా నది ఒడ్డున హిమాలయాల దిగువ ప్రాంతంలో ఉత్తరాఖండ్లో ఉన్న రిషికేశ్ ఉంది. ఋషికేశ్ స్థితి కారకుడు విష్ణుమూర్తి నామాలలో ఒకటి. ఇది హిందువుల పవిత్ర క్షేత్రాలలో ఒకటి. జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని అంటారు. ఇది “ప్రపంచ యోగా రాజధాని”గా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి ప్రకృతి అందాలు మనసును ఆకర్షిస్తాయి. ఇక్కడికి వెళితే మనసంతా ఆధ్యాత్మిక భావనతో నిండిపోతుంది.
అమృత్సర్ : పంజాబ్లో అమృతసర్ సిక్కు మతానికి చెందిన ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడ మనం అసలు సిసలైన ఆధ్యాత్మికతను చూడవచ్చు. ఇక్కడ ప్రపంచ ప్రసిద్ధి చెందిన గోల్డెన్ టెంపుల్ మనల్ని ఎంతగానో ఆకర్షిస్తుంది. వీరి సేవా తత్పరత మనల్ని అమితంగా ఆకర్షిస్తూ ఉంటుంది. అన్ని మతాల ప్రజలు ఇక్కడ ఉచిత సామూహిక భోజనం (లంగర్)లో పాల్గొంటారు
బోధ్ గయా : బోధ్గయా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుద్దుడు జ్ఞానోదయం పొందిన ప్రదేశం. ఇక్కడికి ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో బౌద్ధులు వస్తుంటారు.