వాతాపి, ఇల్వలుడు ఎవరు? వారేం చేసేవారు?

దక్షిణ హిందూ దేశంలోని అడవుల్లో వాతాపి, ఇల్వలుడు, అనే ఇద్దరు భయంకరులైన రాక్షస అన్నదమ్ములు నివసిస్తూ ఉండేవారు. వారిద్దరూ మనుష్యులను చంపి తింటుండేవారు. చంపి తినే పద్ధతి కూడా చాలా చిత్రంగా ఉండేది. ముందుగా ఇల్వలుడు బ్రాహ్మణ రూపం ధరించి ఆ అడవి వెంబడి వెళ్ళే ప్రయాణికులని, తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించమని వినయంగా అడిగేవాడు. అతని ఆహ్వానాన్ని మన్నించి ఇంటికి వెళ్లిన వారికి స్నానం చేసి విశ్రాంతి తీసుకోమని చెప్పి వంటింట్లోకి వెళ్లేవాడు. అక్కడ వాతాపిని చంపి ముక్కలు చేసి ఆ మాంసంతో వంటకాలు చేసేవాడు. వంట అయిపోయాకా అతిధుల్ని పిలిచి స్వయంగా వడ్డించేవాడు.

ఇల్వలుడు వడ్డించిన పదార్ధాలన్నీ బాటసారులు సుష్టిగా తినేవారు. భోజనం పూర్తి చేసి వాళ్ళు పీటమీద నుంచి లేవబోయే సమయానికి ఇల్వలుడు వాళ్ళముందు నిలబడి, ” వాతాపీ! ఓ వాతాపీ! రా! త్వరగా బయటికి రా” అని పిలిచేవాడు. అతిథుల కడుపులో మాంసరూపంలో ఉన్న వాతాపి ఈ పిలుపు వినగానే మళ్ళీ ప్రాణం పోసుకుని వాళ్ళ పొట్టలు చీల్చుకుని బయటకు వచ్చేవాడు. దీంతో ఆ అతిధులు పొట్ట పగిలి చనిపోయేవారు. అప్పుడు అన్నదమ్ములిద్దరూ చనిపోయిన అతిథుల మాంసాన్ని ఆరగించేవారు. ఆ అరణ్యాలలో వుండే మునులంతా అగస్త్యమహర్షి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా మొరపెట్టుకున్నారు.

Share this post with your friends