
గణగణ మోగే గంటలు, బ్రహ్మాండమైన 65 అడుగుల ఎత్తైన పిరమిడ్ నిర్మాణం, అద్భుతంగా చెక్కిన ఆలయంలోని చిత్రకళలు పూరీ జగన్నాథ్ ఆలయ ప్రత్యేకతలు. కృష్ణుడి జీవితాన్ని వివరంగా.. కళ్లకు కట్టినట్టు చూపించే స్తంభాలు, గోడలు.. ఆలయానికి మరింత శోభ తీసుకొస్తాయి. జగన్నాథ ఆలయాన్ని ప్రతి ఏడాది లక్షల భక్తులు సందర్శిస్తారు. ఆలయంలో చాలా ప్రసిద్ధమైనది, ప్రత్యేకమైనది జగన్నాథ రథయాత్ర. ఈశాన్య భారతంలోని ఒడిషాలో ఈ పూరీ జగన్నాథ ఆలయం ఉంది. ఇక్కడ ప్రతి ఏడాది జరిగే రథయాత్ర ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఈ రథయాత్ర నిన్న (శుక్రవారం) ప్రారంభమైంది. ఈ ఆలయాన్ని 1078లో పూరీలో నిర్మించారు.
అయితే ఈ ఆలయం కూడా అన్ని ఆలయాల మాదిరిగానే.. గోపురం, దేవుడు, గంటలు, ప్రసాదం అన్నీ ఉన్నప్పటికీ.. అన్నింటికంటే చాలా ప్రత్యేకమైనది, విభిన్నమైనది. జగన్నాథుడు అంటే లోకాన్ని ఏలే దైవం కొలవైన ఈ ఆలయంలో ప్రతీదీ చాలా మిస్టీరియస్గా ఉంటుంది. ఈ జగన్నాథ ఆలయం గురించి మీకు తెలియని, నమ్మకం కుదరని ఎన్నో ఫ్యాక్ట్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఆలయ గోపురానికి పైన కట్టిన ఫ్లాగ్ చాలా ఆశ్చర్యకంగా ఉంటుంది. సాధారణంగా ఏ గుడికి కట్టిన జెండాలైనా.. గాలి ఎటువైపు ఉంటే.. అటువైపు వీస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం గాలిదిశకు వ్యతిరేకంగా ఈ జెండా రెపరెపలాడుతూ ఉంటుంది. పూరీలో అత్యంత ప్రసిద్ధి చెందిన జగన్నాథ ఆలయం చాలా ఎత్తైనది. మీరు పూరీలో ఎక్కడ నిలబడి.. గోపురంపై ఉన్న సుదర్శన చక్రాన్ని చూసినా.. అది మీవైపు తిరిగినట్టు కనిపించడం ఇక్కడి ప్రత్యేకత.
