పురాణాలలో ధన్వంతరి ప్రస్తావన ఎక్కడ ఉందంటే..

ధన్వంతరి ఎవరనేది తెలుసుకున్నాం కదా. అలాగే ఆశ్వయుజ బహుళ త్రయోదశి రోజున పూజించుకోవాలని కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు ధన్వంతరి ప్రస్తావన ఎక్కడ ఉందో తెలుసుకుందాం. పోతనామాత్యుడు రచించిన భాగవతంలోని క్షీరసాగర మధనం ఘట్టంలో ధన్వంతరి ప్రస్తావన ఉంది. శ్రీ మహావిష్ణువు అవతారమే ధన్వంతరి అని తెలుసుకున్నాం కదా. అమృతం కోసం దేవతలు, రాక్షసులంతా కలిసి మంధర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని క్షీరసాగర మథనం సాగించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు మంధర పర్వతాన్ని కూర్మావతారంలో తన వీపుపై మోశాడు.

ఈ క్షీరసాగర మథనంలో ఆశ్వయుజ బహుళ త్రయోదశి రోజున శ్రీ మహావిష్ణువు ధన్వంతరి అవతారంలో అమృత కలశంతో ఉద్భవించాడని చెబుతారు. అప్పటి నుంచి ప్రతి ఏటా ఆశ్వయుజ బహుళ త్రయోదశి రోజును ధన్వంతరి జయంతిగా నిర్వహించడం జరుగుతోంది. బ్రహ్మ పురాణం ప్రకారం మరో కథనం కూడా ఉంది. అదేంటంటే.. కాశీకి చెందిన ధన్వ అనే రాజు నిత్యం దేవతలను ఆరాధించేవాడు. ఆయన పూజలకు దేవతలు ఎంతగానో సంతోషించారు. దీంతో ధన్వకు ధన్వంతరి అనే పుత్రుడు జన్మిస్తాడని వరం ఇచ్చారు. అయితే ఈ ధన్వంతరి క్షీరసాగరం నుంచి ఉద్భవించిన ధన్వంతరి వంశస్తుడే అని చెబుతారు. అంతేకాకుండా సాగర మథనంలో ఉద్భవించిన ధన్వంతరికి ఇది రెండో జన్మగా కూడా చెబుతారు.

Share this post with your friends