శ్రీ కృష్ణ పరమాత్మకి అక్రూరుడు పరమభక్తుడు,అత్యంత సన్నిహితుడు. అక్రూరుడు ఒకసారి ద్వారకకి వెళ్ళిన సమయంలో సత్యభామ ఆయనతో, “శ్రీ కృష్ణుడు నా భవనానికి వచ్చి చాలా కాలమైంది. మీరు ఆయన వద్దకి వెళ్ళి నేను ఎదురుచూస్తున్నానని చెప్పండి. ఇంక ఒక ఘడియలో కృష్ణుడు రాకపోతే నేను ప్రాణాలు త్యజిస్తాను” అని చెప్పింది. అక్రూరుడు తక్షణమే కృష్ణుని పిలుచుకుని రావడానికి వెళ్ళాడు. లీలావినోదుడైన కృష్ణుని మాయలవలన ఆయన ఎక్కడ వెతికినా కనపడలేదు. ఘడియ దాటిపోతే సత్యభామ అన్నంతపని చేసి తన ప్రాణాలను త్యజిస్తుందేమోనని భయపడ్డాడు అక్రూరుడు.
వెంటనే తానే కృష్ణునిగా మారి సత్యభామ వద్దకు వెళ్ళి..“రాచకార్యాలలో నిమగ్నమైవున్నాను, అవి పూర్తిచేసుకుని నేనే నీ మందిరానికి వస్తాను” అని శ్రీ కృష్ణుడు చెప్తున్నట్టుగా చెప్పి వెలుపలికి వెళ్ళి పోయాడు అక్రూరుడు. సత్యభామ అంతఃపురం నుండి బయటకు రాగానే ఎదురుపడిన శ్రీ కృష్ణునితో తాను చేసిన పని చెప్పాడు. అక్రూరుడు చెప్పినది విని శ్రీకృష్ణుడు “భామ మొండిపట్టుదల తప్పు. ఆమెను సంతుష్టురాలను చేయడానికి నీవు చేసిన తంత్రము తప్పు. ఇద్దరూ ఇందుకు తగిన దండన అనుభవించక తప్పదు. వచ్చే జన్మలో నీవు అంధుడవై జన్మిస్తావు. అదే సమయంలో సత్యభామ మధురాపురి మహారాణి అంతఃపురంలోని పరిచారికగా జన్మిస్తుంది!” అని శాపం యిచ్చాడు.