శ్రీకృష్ణ పరమాత్ముడు, అక్రూరుడి కథ గురించి తెలుసుకున్నాం కదా. అక్రూరుడు, సత్యభామలను శ్రీకృష్ణుడు శపించడం.. దానికి గల కారణాలను సైతం తెలుసుకున్నాం. కన్నయ్య శాపం ఇచ్చిన తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. అక్రూరుడు మరు జన్మలో సూరదాసు అనే వైష్ణవ భక్తునిగా జన్మించాడు. ఆయన కన్నయ్య శాప ప్రకారమే అంధుడిగా జన్మించాడు. అయితే బాహ్య దృష్టి లేక పోయినా తన దివ్య దృష్టితో రాధాకృష్ణులను దర్శిస్తూ, ఆనందంతో వారి గుణగణాలను కీర్తిస్తూ ఎన్నో పాటలు రాశాడు. కష్టాలెన్ని అనుభవించినా కృష్ణుని మీదనున్న భక్తి, విశ్వాసాలను మార్చుకోలేదు.
మరొకచోట జన్మించిన సత్యభామ మధురాపురి మహారాణి అంతఃపురంలో పరిచారికగా సేవలు చేస్తూ వుండి పోయింది. ఒక నాడు మహారాజు సూరదాస్ గానాన్ని వినడానికి ఆహ్వానించాడు. సూరదాస్ తన భక్తి కీర్తనలు ఆలపించి అందరిని ఆనందంలో ముంచెత్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ప్రసన్న వదనంతో చక్రధారిగా దర్శనమిచ్చాడు. అంతవరకు గత జన్మలో చేసిన తప్పిదాలకు శిక్ష అనుభవించిన సూరదాసును, రాజుగారి కొలువులో సేవలుచేస్తున్న సత్యభామని కరుణించి తనలో ఐక్యం చేసుకున్నాడు. భగవంతుడు ఎంతటి కరుణా సముద్రుడో అంతటి కఠినాత్ముడు కూడా. స్వపర భేదం లేదు. తప్పు చేసినవారు శిక్ష అనుభవించక తప్పదు.