‘పారం’ అంటే- ఒడ్డు, దాటడం అనే అర్థాలున్నాయి. వాటి నుంచి పుట్టిందే ‘పారాయణం’ అనే పదం! ఏదైనా గ్రంథాన్ని ఒకసారి పూర్తిగా చదివే ప్రక్రియను పారాయణం చేయడమంటారు. ఇది సాధారణమైన అర్థం. అంతరార్థం గ్రహించగలిగితే, గ్రంథం చదివినవారి జీవితం తరిస్తుంది. ఫలితంగా వారు తమ జీవితాల్లో-చతుర్విధ పురుషార్థాల్లోని అర్ధ, కామాలకు బదులు ధర్మ, మోక్షాలకే ప్రాధాన్యమిస్తారు. గ్రంథాన్ని మామూలుగా చదివితే అది పఠనం. దాని వల్ల విషయం ఒక్కటే తెలుస్తుంది. మనసులో కోరిక కలిగి, అది నెరవేరడానికి చదవడాన్ని పారాయణంగా భావిస్తారు కొందరు. దాని వల్ల ఆ గ్రంథం లోని అంతర్గత విషయాలు తెలుస్తాయి. భక్తి, వైరాగ్య, జ్ఞానాలు కలుగుతాయి. వాటితో అనేక ఆధ్యాత్మిక ప్రయోజనాలున్నాయి.
మొదట ఏదో ఒక కోరికతో పారాయణం మొదలు పెడితే, అది పూర్తికావచ్చేసరికి ఆ గ్రంథంతో పాటు దైవంతో విడదీయలేని మానసిక అనుబంధం ఏర్పడుతుంది. అప్పుడు కోరిక స్థానంలో మానసిక శాంతి చోటుచేసు కుంటుంది. పాడగా, పాడగా రాగం వీనులవిందుగా మారుతుంది. అభ్యాసం చేయగా, చేయగా వైరాగ్యం అలవాటవుతుంది. పర్యవసానంగా, ఐహిక వాంఛల మీద వ్యామోహం తగ్గుతుంది. ఆధ్యాత్మిక గ్రంథాలైన భగవద్గీత, రామాయణం, భాగవతాల్ని సర్వసాధారణంగా ఎందరో పారాయణం చేస్తారు. మొత్తం గ్రంథాన్ని లేదా అందులోని భాగాన్ని/ఘట్టాన్ని ఎంచుకుంటారు. భగవద్గీతలో కొన్ని అధ్యాయాలు, రామాయణంలో iసర్గలు, భాగవతంలో ఘట్టాలు (‘రోజుకు ఇన్ని’ అని) నిర్ణయించుకుంటారు. నియమాలకు లోబడి, వాటిని నియమిత కాలంలో పూర్తిచేస్తారు. ఒక్కో గ్రంథ పారాయణాన్ని ఒక్కొక్క ఉద్దేశంతో కొనసాగిస్తారు.