
పెద్దాపురం మరిడమ్మ ఆలయం గురించి ఇప్పటికే మనం చాలా విశేషాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మరిడమ్మ ఆలయ స్థల పురాణం గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో కలరా, మశూచి లాంటి వ్యాధులు ప్రబలి ఊరిలో అనేక మంది మృత్యువు భారిన పడుతుండేవారు. పెద్దాపురం పరిసర ప్రాంతాల నుండి కలరా, మశూచి మహమ్మారిని పారద్రోలిన మారెమ్మ అమ్మవారు పాత పెద్దాపురంలో గ్రామదేవతగా ఎన్నో ఏళ్ల కిందటే వెలిశారు. ఆనాటి నుండి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ తల్లికి పూజాది కార్యక్రమాలు నిర్వహించేవారు. 17 వ శతాబ్దములో పెద్దాపురంలో మానోజి చెరువుకి అతి సమీపంలో గ్రామదేవతగా శ్రీ మరిడమ్మ అమ్మవారు వెలిసింది.
ప్రస్తుతం మరిడమ్మ తల్లి దేవాలయం ఉన్న ప్రదేశం అంతా చిట్ట అడివిగా వుండేధి. ఒకసారి ఆ అడవిలో పశువుల కాపరులకి 16 ఏళ్ల యువతి కనిపించి తాను చింతపల్లి వారి ఆడపడుచుని నేను ఈ ప్రదేశములో ఉన్నానని తన వాళ్ళకి చెప్పాలని చెప్పి మాయం అయ్యింది. ఈ వింతను చూసిన పశువుల కాపరులు వెనువెంటనే చింతపల్లి వారికి జరిగిందంతా చెప్పారు. అంతకు మునుపే మరిడమ్మ అమ్మ వారు చింతపల్లి వారికి కలలో కనిపించి తనకి మానోజీ చెరువు సమీపంలో ఆలయం నిర్మించవలసినదిగా ఆజ్ఞాపించారు. ఆ చింతపల్లి కుటుంబ సభ్యులు అంతా ఆ మానోజి చెరువు చుట్టుపక్కల ప్రాంతములు వెతకగా వారికి పసుపు పూసిన ఒక కర్ర గద్దె అమ్మవారి ప్రతి రూపము దర్శనమిచింది. ఈ గద్దెను ఇక్కడే ప్రతిష్ఠించి తాటాకు పాక వేసి ఆనాటి నుండి నిత్య ధూప ధీప, నైవేధ్యములు చెల్లించి ఆరాధించటము ప్రారంభించారు.
