
ఆకాశమే లింగం. భూమి దాని పీఠం. అది సమస్త దేవతలకు నిలయం. ఇందే అంతా లయం చెందుతుంది. అందుకే దీనిని లింగం అని అన్నారు. ‘లిం’ అంటే మన కంటికి కనిపించకుండా లీనమై ఉన్నదానిని, ‘గం’ అంటే ఒక గుర్తు రూపంలో తెలియజేస్తుంటుంది. అందుకే అది లింగమైంది. ఈ సృష్టి సమస్తం శివమయం. ఈ సమస్తం ఆయనచే సృష్టించబడింది. సృష్టికి పూర్వం ఈ సమస్త విశ్వమంతా నీటితో నిండి నిభిడృకృతమై అంతులేని మహాసముద్రంగా ఉండేదని చరిత్ర పాఠాల్లో చదువుకున్నాం. ఆ మహాజలం నుంచి ఓ మహా తేజస్సు ఉత్పన్నమైంది. ఆ తేజఃపుంజమే క్రమంగా ఒక రూపాన్ని సంతరించుకుంది.
ఆ తేజోమయ రూపమే పరబ్రహ్మం. ఆయనే లింగ రూపాన్ని ధరించిన శివుడు. సామాన్యంగా లింగ శబ్దానికి చిహ్నం లేక లక్షణం లనే అర్థాలున్నాయి. ప్రకృతి, వికృతులు రెండూ లింగమనే సౌంఖ్య దర్శనం చెప్పింది. విగ్రహాన్ని మూర్తి అని అంటారు. మూర్తి ధ్యానాన్ని బట్టి ఆకారాలు ఉంటాయి. కానీ లింగములో ఆకారంగానీ, రూపంగానీ, చెప్పవీలుబడదు. అదొక చిహ్నం మిత్రమే. లయనా ల్లింగముచ్యతే అని అన్నారు. అంటే, లయం ప్రళయం కావడం వల్ల లింగమని చెప్పబడుతోంది. ప్రళయాగ్నిలో సర్వమూ భస్మమై శివలింగంలో చేరుతుంది. లింగార్చనతో సర్వదేవతల పూజ జరుగునని లింగపురాణం చెబుతుంది.
