ఉభయ సంధ్యలలో నిద్రపోయే వారికి లక్ష్మీదేవి ఏం చెప్పిందంటే..

నిద్రించేవాని కోరికలను దేవతలు తీర్చరనేది వేదవాక్యం. సదాచారాన్ని ప్రబోధించే వేదవాక్యమిది. నిద్రాపరుడు అభివృద్ధి చెందడు. అతినిద్ర బుద్ధిశక్తిని మందగింపజేస్తుంది. నిద్ర జీవితానికి అవసరమే, కానీ దానికి ‘మితి’ ఉంది. యోగాది సాధనల ద్వారా, వ్యాయామాల ద్వారా, మితాహారం ద్వారా నిద్రను నియంత్రించవచ్చు. తగినంత నిద్ర శరీరానికి శక్తినిస్తుంది. కానీ, మితిమీరిన నిద్ర వలన సోమరితనం, వాయిదాలు వేయడం, చురుకుతనం కోల్పోవడం జరుగుతాయి.

ఐహిక జీవితానికి గానీ, పారమార్థిక సాధనకి గానీ నిద్ర పెద్ద ప్రతిబంధకం. పగటి నిద్ర, రాత్రి ఎక్కువ సేపు మేల్కొని ఉండడం, సూర్యోదయానికి మునుపు మేల్కొనలేక పోవడం… ఇవన్నీ దరిద్ర లక్షణాలుగా శాస్త్రం వర్ణించింది.

సాయం సంధ్యవేళ ఎందుకు నిద్ర పోకూడదని అంటారో లక్ష్మీదేవి చెప్పిన మాట తెలిస్తే.. అర్థమవుతుంది. “ఉభయ సంధ్యలలో నిద్రపోయిన వారిని నేను విడిచిపెడతాను” అని లక్ష్మీదేవి స్వయంగా చెప్పినట్లు మహాభారతంలోని మాట. ఇదే విషయం పురాణాలలో కూడా చాలా వివరించారు. వేదం చెప్పిన సదాచారాన్నే పురాణాలు సామాన్యులకు సైతం సుబోధకమయ్యేలా తెలియజేశాయి. సంధ్యాకాలాలు ఆధ్యాత్మిక సాధనకి, తద్వారా దేవతానుగ్రహ సంపాదనకి ముఖ్యమైనవి. ఆ సమయంలో ధ్యాన, ఉపాసనాదులు తప్పనిసరిగా చేయాలని ధర్మగ్రంథాలు హెచ్చరికగా బోధించాయి. ఉభయసంధ్యలలో నిద్రపోయినవారి గతంలో చేసుకున్న పుణ్యాలన్నీ నశిస్తాయని పురాణాదులు చెబుతున్నాయి.

Share this post with your friends