తిరుత్తణి శ్రీ వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామివారికి తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి తరపున సారెను పంపించడం జరిగింది. శ్రీ మలయప్ప స్వామివారి తరుఫున పట్టు వస్త్రాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్రీ జె.శ్యామలరావు సోమవారం సమర్పించారు. టీటీడీ ఆధికారులకు తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి ఆలయ ఛైర్మన్ శ్రీ శ్రీధర్, జాయింట్ కమిషనర్ శ్రీ అరుణాచలం, తిరుత్తణి ఆలయ బోర్డు సభ్యులు, ఇతర ఆధికారులు ఘన స్వాగతం పలికి పట్టు వస్త్రాలను స్వామివారికి అలంకరించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ భారతదేశంలోనే ప్రసిద్ది గాంచిన శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో తిరుత్తణి అత్యంత ప్రముఖమైనదని తెలిపారు. టీటీడీ 2006 నుండి ఆడికృతికను పురస్కరించుకుని శ్రీ సుబ్రమణ్యస్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించడం ఆచారంగా వస్తున్నదని చెప్పారు. స్వామివారి అనుగ్రహంతో ప్రజలు అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, పారుపత్తేదార్ శ్రీ తులసి ప్రసాద్, వేద పారాయణదారులు ఉన్నారు.