తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భద్రతాపరమైన జాగ్రత్తలను పరిశీలించిన టీటీడీ

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 4 నుంచి 12వ తేదీ వరకూ జరగనున్న నేపథ్యంలో భద్రత పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సోమవారం టీటీడీ సీవీఎస్వో శ్రీ శ్రీధర్, అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సీవీఎస్వో భక్తుల రద్దీకి అనుగుణంగా విస్తృతంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. వాహన మండపం, భక్తులు గ్యాలరీలలోనికి వచ్చేందుకు మాడ వీధులలో ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు, గ్యాలరీలలోని ముఖ్యమైన ప్రాంతాలను పరిశీలించారు. ట్రాఫిక్ సమస్య లేకుండా వాహనాల పార్కింగ్, తదితర అంశాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈఈలు శ్రీ సుబ్రహ్మణ్యం, శ్రీ సుధాకర్, డిప్యూటీ ఈవో శ్రీమతి ఆశాజ్యోతి, ఆర్యోగ శాఖ అధికారి డా.మధుసూదన్ రావు, విజివోలు శ్రీ సురేంద్ర, శ్రీ రామ్ కుమార్, శ్రీ నంద కిషోర్, తదితరులు పాల్గొన్నారు.

టీటీడీలోని వివిధ విభాగాలపై ఈవో శ్రీ జె.శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి సోమవారం సమీక్షించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని ఆయన ఛాంబర్‌లో ఈవో సమీక్ష నిర్వహించారు. శాఖాపరమైన సమావేశాలలో భాగంగా శ్రీవారి ఆలయం, ఇంజినీరింగ్ పనులు, రెవెన్యూ, పంచాయతీ, రిసెప్షన్, పారిశుధ్యం, అన్నప్రసాదం విభాగాలతో ఈఓ సమీక్షించారు. ఆయా ప్రాంతాలలో భక్తుల సౌకర్యార్థం చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధిపతులందరికీ ఆయన సూచించారు. ఈ సమావేశంలో జేఈవోలు శ్రీమతి గౌతమి, శ్రీ వీరబ్రహ్మం, సీవిఎస్‌వో శ్రీ శ్రీధర్‌, సీఈ శ్రీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Share this post with your friends