
ఇవాళ జ్యేష్ట అమావాస్య. హిందూమతంలో అమావాస్యకు సైతం ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. అందునా జ్యేష్ట అమావాస్యకు అత్యంత ప్రాధాన్యత. అమావాస్య నాడు పితృదేవతలను స్మరించుకోవడమే కాకుండా గౌరవించుకుంటారు. ఈ రోజున పూజలు, దానధర్మాలతో పాటు పిండ ప్రదానం చేయడం, తర్పణాలు వదులుతారు. ఇలా చేయడం వల్ల పితృదేవతలు సంతోషించి ఆశీస్సలు అందిస్తారని పురాణ వచనం. జేష్ట అమావాస్య రోజున ముఖ్యంగా నదీ స్నానమాచరించి.. అనంతరం పరమేశ్వరుడిని పూజిస్తారు. ఇలా చేయడం వల్ల మన కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మకం. నెగిటివిటీ అంతా తొలగిపోతుంది.
ఇవాళ ఉపవాసం ఉంటారు. ఇలా ఉండటం వల్ల శరీరం, మనసు, ఆత్మ శుద్ధి అవుతాయి. ఇక జ్యేష్ట అమావాస్యనాడు పెళ్లయిన స్త్రీలు కుటుంబంలో సుఖసంతోషాలు వర్థిల్లాలని, వైవాహిక జీవితం ఆనందంగా సాగాలని.. శివుడిని ప్రార్థిస్తారు. ఇవాళ రావి చెట్టుకు పూజ చేస్తారు. రావి చెట్టులో ముక్కోటి దేవతలుంటారని హిందువుల నమ్మకం. కాబట్టి పెళ్లికాని అమ్మాయిలు మంచి వరుడు రావాలని కోరుకుంటూ రావి చెట్టును పూజిస్తారు. అలాగే సావిత్రి కథను చదవడమో లేదా వినడమో చేస్తారు. ఈ రోజున సంధ్యా సమయంలో దీప దానం చేస్తే శుభఫలితాలు కలుగుతాయని నమ్మకం. సాయంత్రం వేళ రావిచెట్టు ముందు దీపం వెలిగించి, ప్రదక్షిణలు చేస్తే మన కష్టాలన్నీ తొలగిపోతాయని చెబుతారు.
