శివుడిని అభిషేక ప్రియుడని అంటారు. నీటితో అభిషేకం చేసినా చాలు.. పొంగిపోయి కోరిన వరాలను కట్టబెడతాడట. ముఖ్యంగా శ్రావణమాసం రెండవ శుక్రవారం శివారాధనకు, శివస్త్రోత్రం, ఉపవాసం ఉంటే చాలా మంచిదట. ఈ సమయంలో పరమేశ్వరుడిని అభిషేకం చేస్తే ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుందట. శివుడిని పంచామృతంతోనూ.. నీటితోనూ.. నెయ్యి.. తేనె, చెరుకురసం వంటి వాటితో అభిషేకిస్తూ ఉంటారు. వీటిలో దేనిని చేయడం వలన ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందో తెలుసుకుందాం.
పుణ్యక్షేత్రం నుంచి తెచ్చిన నీటితో అభిషేకం :
ఏదైనా పుణ్యక్షేత్రం నుంచి తెచ్చి నీటితో శివునికి శ్రావణ మాసంలో అభిషేకం నిర్వహిస్తే మీరు జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందుతారట. వ్యక్తి మరణానంతరం మోక్షాన్ని పొందుతాడట.
నీటితో అభిషేకం :
మహాశివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో నీరు ఒకటి. అందుకే శివలింగంపై నిత్యం నీరు పడేలా ఏర్పాటు చేస్తారు. ఈ నీటితో అభిషేకం చేస్తే ఆర్థిక సమస్యలు తీరుతాయట. అయితే శివుడిని అభిషేకించే నీరు స్వచ్ఛమైనది గానూ.. చల్లగానూ ఉండాలట.
నెయ్యితో అభిషేకం :
శివలింగానికి నెయ్యితో అభిషేకం చేస్తే చాలా మంచిదట. కుటుంబమంతా సుఖశాంతులతో ఉంటుందట. కుటుంబం వృద్ధి చెందుతుందట.
తేనెతో అభిషేకం :
మహాశివుడిని తేనెతో అభిషేకిస్తే ఉద్యోగ, వ్యాపారంలో పురోభివృద్ధితో పాటు సమాజంలో గౌరవాన్ని పొందుతారు. ఏ పనిలో అయినా విజయం సాధిస్తారట.
పంచామృతంతో :
శివలింగాన్ని పంచామృతంతో అభిషేకిస్తే కోరిన కోరిక ఏదైనా నెరవేరుతుందట.
చెరుకు రసంతో అభిషేకం :
శివునికి అత్యంత ఇష్టమైన వాటిలో చెరకు రసం ఒకటి కాబట్టి శివుడిని చెరుకు రసంతో అభిషేకిస్తే డబ్బు సమస్యలన్నీ మాయమవుతాయట.