
తమిళనాడు రాష్ట్రంలోని తిలతర్పణపురి అనే గ్రామంలో కొలువుదీరిన నరముఖ గణపతి గురించి తెలుసుకున్నాం కదా. ఇక్కడ శ్రీరాముడు తన తండ్రి దశరథ మహారాజుకు ఇక్కడే పిండ ప్రదానం చేశాడు. ఈ నరముఖ వినాయక దేవాలయాన్ని పితృ దోషాలతో బాధపడేవారు సందర్శిస్తే ఆ దోషాలన్నీ కచ్చితంగా తొలగిపోతాయని నమ్మకం. పితృ దేవతల కోసం ఎన్ని చోట్ల తర్పణాలు వదిలినా ప్రయోజనం లేకుంటే మాత్రం నరముఖ విఘ్నేశ్వరుడి దేవాలయానికి వెళ్లి తర్పణాలు విడిస్తే చాలు.. ఆ దోషాలన్నీ తొలగిపోతాయని చెబుతారు.
ఈ ఆది వినాయకుని ఆలయంలో గణేశుడితో పాటు పరమేశ్వరుడు, సరస్వతి దేవి, ఆది శంకరుడు, వేదవ్యాసుడు, గాయత్రీ దేవి, సదాశివ బ్రహ్మేంద్ర, సంతపట్టినాథ్ విగ్రహాలు కూడా ఉన్నాయి. ఆసక్తికర విషయం ఏంటంటే.. సంకష్ట హర చతుర్థి నాడు మహా గురువు అగస్త్యుడు స్వయంగా ఇక్కడికి వచ్చి ఆది వినాయకుడిని పూజిస్తాడని చెబుతారు. ఇక గురువారం వచ్చిందంటే ఇక్కడ నరముఖ వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీ. గణేష్ నవరాత్రుల గురించి అయితే చెప్పాల్సిన పని లేదు.
