ఈ మిస్టీరియస్ శివుడు మరింత ప్రత్యేకం..

మనదేశంలో శివాలయాలకు కొదువేమీ లేదు. ఎన్నో మిస్టరీ ఆలయాలు ఛేదించలేని రహస్యాలు ఇక్కడ ఉన్నాయి. ఒక్కో ఆలయంలో ఒక్కో పేరుతో పరమేశ్వరుడు కొలువై ఉన్నాడు. త్రేతా యుగం నాటి ఆలయం కూడా నేటికీ ఉంది. అదొక మిస్టీరియస్ ఆలయం. దాని మిస్టరీనీ ఛేదించడం ఎవరి తరమూ కాలేదు. ఆ ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని బుగ్గలో రామలింగేశ్వరునిగా శివయ్య కొలువుదీరాడు. ఈ ఆలయం ఎంతో మహిమాన్వితమైనది. త్రేతాయుగంలో సాక్షాత్తూ ఆ శ్రీరామచంద్రుడే ఇక్కడి శివయ్యను ప్రతిష్టించాడట. అందుకే ఈ శివుడిని రామలింగేశ్వరసామిగా కొలుస్తారు.

ఈ ఆలయ ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. ఏడాదిలో 365 రోజులు గర్భగుడిలో కొలువై ఉన్న స్వామివారి లింగం కింద నుంచి జలధార ఊరుతూనే ఉంటుంది. అసలు అది ఎక్కడి నుంచి ఊరుతుందో ఎవరికీ తెలియదు. బుగ్గ అనగా నీటి ఊట. వర్షాలు లేకపోయినా.. మండు వేసవిలో అయినా.. ఊరంతా నీటి వనరులు అంతరించి పోయినా కూడా శివలింగం కింద నుంచి నీరు మాత్రం ఊరుతూనే ఉంటుంది. స్వామివారి లింగం నుంచి నీటి బుగ్గ ఏర్పడటం వల్ల ఈ ఆలయానికి బుగ్గ రామలింగేశ్వరుడు అనే పేరు వచ్చింది. కోరిన కోరికలు తీర్చే భక్తుల పాలిట కొంగు బంగారంగా బుగ్గ రామలింగేశ్వరుడు పూజలు అందుకుంటున్నాడు.

Share this post with your friends