
స్నానం చేస్తే పూజ చేసుకునే ముందు విభూతిని పొడి చేసి ఎడమచేతిలో వేసుకుని దాంట్లో రెండు మూడు నీటి చుక్కలు వేసి ఎడమ చేతిలో వేసిన విభూతి మీద కుడిచేతిని మూత పెట్టాలి. అలా పెట్టి ఆ విభూతి చేత మీకు కలిగే గొప్ప మహాత్మ్యమును గురించి స్మరించుకోవాలి.
“భూతిం భూతకరీ, పవిత్ర జననీ పాపౌఘ విధ్వంసినీ
సర్వోపద్రవనాశినీ శుభకరీ సర్వార్థ సంపత్కరీ
భూత ప్రేత పిశాచ రాక్షస గణారిష్టాది సంహారిణీ
తేజోరాజ్య విశేష మోక్షణకరీ భూతి స్సదా ధార్యతామ్!!” అని చెప్పాలి.
విభూతి ధారణ సమస్త పాపములని పోగొడుతుంది. భూత,ప్రేత,పిశాచ,రాక్షస గణముల నుంచి రక్షిస్తుంది. తేజస్సు వృద్ధిని పొందుతుంది. విశేషమయిన ఐశ్వర్యమును, మోక్షమును ఇవ్వగలదు. కనుక నేను ఈ విభూతిని ధరించుచున్నాను అని చెప్పి ఆ తడి విభూతిని త్రిపుండ్రాలుగా దిద్దుకోవాలి. బ్రహ్మచారి అయితే సాధ్యం అయినంత వరకు “ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్” అన్న మంత్రం చెప్పి సజల విభూతిని (తడి విభూతిని) ధరించాలి. ఇవేమీ మనకి చేతకావు అనుకుంటే, తేలికైన మార్గం ఒకటి ఉంది. కుడి చేతిని ఎడమ చేతి మీద వేసి “శ్రీకరంచ పవిత్రం చ శోకమోహ వినాశనం లొకవశ్యకరం చైవ భస్మం త్రైలోక్య పావనం” అని చెప్పాలి.
