
తొండమానపురం శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామి ఎందుకు కూర్చొన్న భంగిమలో దర్శనమిస్తాడంటే.. దీనికీ ఓ కథ ఉంది. అదేంటో తెలుసుకుందాం. తిరుమలలోని శ్రీ మలయప్ప స్వామివారి ఆలయాన్ని నిర్మించిన తొండమాన్ చక్రవర్తి గతంలో ఇదే ప్రాంతంలో నివసించేవాడట. ఆయనకు శ్రీ వేంకటేశ్వర స్వామి వారంటే అమితమైన ప్రేమట. నిత్యం తిరుమలకు వెళ్లి స్వామివారిని పూజించుకుని వచ్చేవాడట. అయితే కొంతకాలానికి వయోభారం మీద పడటంతో నిత్యం తిరుమలకు వెళ్లలేక ఇబ్బందిపడేవాడట.
నిత్యం స్వామివారిని దర్శించుకోలేకపోతున్నానన్న బాధతో ఆవేదన చెందేవాడట. అలాగని స్వామివారిని దర్శించుకునేందుకు వెళదామంటే శరీరం సహకరించేది కాదట. ఇలా తొండమాన్ చక్రవర్తి నిత్యం సంఘర్షణ అనుభవిస్తూ ఉండేవాడు. దీంతో తొండమాన్ చక్రవర్తి ఇంట్లోనే స్వామివారిని ధ్యానిస్తూ ఉండేవాడు. అలా ఒకసారి తన ఇంట్లో స్వామివారిని ధ్యానిస్తూ ఉన్న సమయంలో స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతుడై వచ్చి ఎదురుగా కూర్చొన్నాడట. స్వామివారి దర్శనభాగ్యంతో పులకించిపోయిన తొండమాన్ చక్రవర్తి అక్కడ అలాగే వెలిసి ఉండమని స్వామివారిని కోరాడట. భక్తుడి కోరిక మేరకు శ్రీనివాసుడు ఉభయ దేవేరులతో కలిసి కూర్చొన్న భంగిమలో అక్కడే వెలిశాడట. దీంతో తొండమాన్ చక్రవర్తి తన ఇంటినే ఆలయంగా మార్చాడట.
