
నేపాల్ రాజధాని ఖాట్మండు నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో శివపురి కొండ మధ్యలో ఉన్న బుధ నీలకంఠ ఆలయం గురించి ఇప్పటికే మనం చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక్కడ రాజ కుటుంబంలోని వ్యక్తులు పూజలు చేస్తే మరణిస్తారని కూడా తెలుసుకున్నాం. ఇక ఈ ఆలయ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రదేశంలో ఒక రైతుకు చెందినదట. ఒకరోజు అక్కడి చెరువులో ఆ రైతుకు ఈ విగ్రహం కనిపించిందట. 13 మీటర్ల పొడవైన ఈ చెరువులో ఉన్న విష్ణువు విగ్రహం ఐదు మీటర్ల పొడవుతో.. సర్పాల తలలు విష్ణువుకి గొడుగు పడుతున్న రూపంలో విగ్రహం ఉంటుంది. వెంటనే విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్టించి పూజలు నిర్వహించారు.
ఈ ఆలయంలో విష్ణువుతో పాటు శంకరుడి విగ్రహం కూడా ప్రతిష్టించారు. యోగ నిద్రలో ఉన్న విష్ణు మూర్తి విగ్రహం సైతం ఒక్కోసారి శివుడిలా.. అది కూడా సాగర మథనంలో హాలాహలం బయటకు వచ్చినప్పుడు విశ్వ రక్షణ కోసం గరళంలో దాచుకున్న శివుడిలా అనిపిస్తాడట. అయితే హాలాహలాన్ని గరళంలో దాచుకున్న తర్వాత శివుడి గొంతులో మంటగా అనిపించిందట. ఆ వేడి తాళలేక శివుడు తన త్రిశూలంతో పర్వతాన్ని కొట్టి నీటిని బయటకు తీసి తాగేసి గొంతు మంట నుంచి ఉపశమనం పొందాడు. అలాగే అక్కడ కొంతసేపు సేదతీరాడనే కథ. అయితే శివుడు తన త్రిశూలంతో కొట్టడం వలన వచ్చిన నీరు సరస్సుగా మారింది. ఇప్పుడీ సరస్సును గోసాయికుండ అని పిలుస్తారు. ఈ చెరువే బుధ నీలకంఠ ఆలయానికి ప్రధాన నీటి వనరు. ప్రతి ఏటా ఆగస్ట్లో నిర్వహించే శివుడి ఉత్సవంలో ఈ సరస్సు కింద శివుడి ప్రతిమ లభిస్తుందట.
