సూర్య భగవానుడికి ఆలయాలు చాలా తక్కువ. ఉన్న కొద్ది ఆలయాలు మాత్రం ప్రఖ్యాతిగాంచినవే కావడం విశేషం. అలాంటి ఆలయాల్లో అరసవెల్లి సూర్యభగవానుడి ఆలయ౦ ఒకటి. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి 1.6 కి.మీ దూరంలో ఉంది. ప్రతిఏటా రథ సప్తమి ఇక్కడ అత్యంత వైభవంగా జరుగుతుంది. దీనికి వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ఈ ఆలయంలో మూలవిరాట్ను సాక్షాత్తు దేవేంద్రుడే ప్రతిష్టించాడని చెబుతారు. అయితే పద్మపురాణం మాత్రం మరోలా చెబుతోంది. దీని ప్రకారం ఇక్కడి మూలవిరాట్ను స్వగోత్రికుడు అయిన కశ్యప మహాముని ప్రతిష్టించాడు.
ఇక్కడి ఏడాదికి రె౦డు సార్లు సూర్యకిరణాలు గుడిలోని మూలవిరాట్ను తాకుతాయి. ఈ దృశ్యాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు స్వామివారి ఆలయానికి వస్తారు. ఇలా మూలవిరాట్ను సూర్యకిరణాలు తాకడమనేది.. ఈ ఆలయ నిర్మాణ గొప్పతన౦గా పేర్కొంటారు. ఈ ఆలయాన్ని 7వ శతాబ్ద౦లో నిర్మించారు. అయితే 17వ శతాబ్దంలో నిజాం నవాబు ధ్వంసం చేసిన ఆలయాల్లో ఇది కూడా ఒకటి. అయితే దాడి విషయాన్ని ముందుగానే తెలుసుకున్న హిందూ పండితుడు సీతారామ శాస్త్రి స్వామి మూలవిరాట్టును తీసుకెళ్లి ఒక బావిలో పడవేయించాడట. ఈ విగ్రహాన్ని 157 సంవత్సరాల క్రితం తిరిగి బావిలో నుంచి తీశారు. ఎలమంచి పుల్లజీ పంతులు బావిలో నుంచి విగ్రహాన్ని తీయించి ఆలయంలో పున: ప్రతిష్టించారు.