
పార్వతీ పరమేశ్వరులను ఆది దంపతులుగా భక్తులు కొలుస్తారు. అందుకే ఎరినైనా ఆశీర్వదించినా కూడా ఆది దంపతుల మాదిరిగా కలిసుండాలని దీవిస్తారు. శివపార్వతులది అన్యోన్య దాంపత్యం. అందుకే పార్వతీమాతకు శివుడు అర్థ శరీరం ఇచ్చేశాడు. వీరిని తలుస్తూ చేపట్టేదే కేదార గౌరీ వ్రతం. ఈ వ్రతాన్ని ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఎక్కువగా జరుపుకుంటారు. దీపావళి రోజున ఈ కేదార గౌరీ వ్రతాన్ని భార్యాభర్తలిద్దరూ కలిసి చేసుకుంటారు. భర్తకు కుదరనప్పుడు భార్య.. ఆమెకు వీలుకానప్పుడు భర్త ఈ వ్రతాన్ని చేసుకుంటారు.
వివాహం కాని ఆడపిల్లలు కూడా ఈ నోము ఆచరించవచ్చు. అలాంటి కేదార గౌరీ వ్రతాన్ని ఇవాళ దక్షిణాదివాసులంతా జరుపుకుంటున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 31వ తేదీ మధ్యాహ్నం 3:52 నిమిషాల నుంచి అమావాస్య మొదలై నవంబర్ 1వ తేదీ సాయంత్రం 6:57 గంటల వరకు వరకూ ఉంది. సాధారణంగా పర్వదినాలు, వ్రతాలు అన్నీ మనం ఉదయ తిధితోనే జరుపుకుంటాం. కాబట్టి నవంబర్ 1వ తేదీనే కేదార గౌరీ వ్రతం జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచించారు. ఆ ప్రకారమే నేడు భార్యాభర్తలంతా కేదార గౌరీ వ్రతాన్ని ఆచరిస్తున్నారు.
