శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జరుగుతున్న సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాల్లో రెండో రోజైన గురువారం రాత్రి స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు.
అనంతరం రాత్రి 7 గంటల నుంచి హనుమంత వాహనంపై స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గోపీనాథ్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలు భక్తులు పాల్గొన్నారు. ఇవాళ ఉదయం కూడా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం జరుగనుంది. ఇక ఇవాళ సాయంత్రం స్వామివారికి గరుడ వాహనసేవ జరుగనుంది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరుకానున్నారు. నేటితో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు ముగియనున్నాయి.