రూ.38 లక్షల విరాళంతో ఒకరోజు అన్నప్రసాద వితరణ..

తిరుమ‌ల‌ శ్రీవారి దర్శనార్థం దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు నిత్యాన్నదానం ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం రుచిగా.. శుఛిగా అన్నప్రసాదాలు అందిస్తుందన్న విషయం తెలిసిందే. అయితే టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు తాజాగా ఒక రోజు విరాళ పథకం ప్రారంభించింది. దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. ఒక రోజు పూర్తిగా అన్నప్రసాద వితరణకు రూ.38 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఉదయం అల్పాహారం కోసం – రూ.8 లక్షలు, మధ్యాహ్న భోజనం కోసం – రూ.15 లక్షలు, రాత్రి భోజనం కోసం – రూ.15 లక్షలు అందించి దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించవచ్చు.

విరాళం అందించే దాత పేరును వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ప్రదర్శిస్తారు. అదేవిధంగా దాతలు తమ కోరిక మేరకు ఒకరోజు ఇక్కడ అన్నప్రసాదాలు వడ్డించే అవకాశాన్ని పొందొచ్చు. ప్రస్తుతం తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -1, 2లోని కంపార్ట్‌మెంట్లు, బయటి క్యూలైన్‌లు, పీఏసీ-4(పాత అన్నప్రసాదం ), పీఏసీ-2, తిరుపతిలోని శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యం, శ్రీనివాసం, విష్ణునివాసం కాంప్లెక్సులు, రుయా ఆసుపత్రి, స్విమ్స్, మెటర్నిటీ ఆస్పత్రి, బర్డ్, ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రి, తిరుచానూరులోని అన్నప్రసాద భవనంలో భక్తులకు ఉచితంగా అన్నప్రసాద వితరణ జరుగుతోంది.

తిరుమలలోని ఫుడ్ కౌంటర్లలో అన్నప్రసాదాలు అందిస్తున్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్-1, 2లోని కంపార్ట్‌మెంట్లు, వృద్ధులు, దివ్యాంగులు వేచి ఉండే కాంప్లెక్స్, రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన కాంప్లెక్స్, ప్రధాన కల్యాణకట్టలో టీ, కాఫీ, చంటిపిల్లలకు పాలు అందిస్తున్నారు.

Share this post with your friends