తిరుపతిలోని నారాయణవనం శ్రీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఇవాళ అంటే మే 15న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ప్రారంభమైంది. ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది నిర్వహించనున్నారు. నారాయణవనం శ్రీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు మే 21 నుంచి ప్రారంభం కానున్నాయి. మే నెల 29వ తేదీ వరకూ స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తున్నారు. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అనంతరం మే 20న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం నిర్వహించనున్నట్టు టీటీడీ వెల్లడించింది. . బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి రోజూ ఉదయం 7.30 నుంచి 9.30 గంటల వరకు.. అలాగే రాత్రి 7 నుంచి 9 గంటల వరకూ వాహనసేవలను నిర్వహించనున్నట్టు టీటీడీ తెలిపింది.