
సూర్య భగవానుడి ఆలయాలు చాలా తక్కువగా ఉన్నాయి. కాశీలో మాత్రం 12 సూర్య దేవాలయాలున్నాయి. ఒక్కో దేవాలయంలో ఒక్కో పేరుతో సూర్యుడు పూజలందుకుంటున్నాడు. అన్ని దేవాలయాలూ చాలా ప్రాముఖ్యతగాంచాయి. ఇక ఈ 12 సూర్యదేవాలయాల్లో ద్రౌపదాదిత్యుని ఆలయం కూడా ఉంది. స్కాందపురాణంలోని కాశీఖండంలో ఈ సూర్య భగవానుడిని ద్రౌపది ప్రతిష్టించినట్టుగా తెలుస్తోంది. పాండవులు జూదంలో ఓడిన తర్వాత అరణ్యవాసం చేయాల్సి వచ్చిన విషయం తెలిసిందే.
ఆ సమయంలో పాండవులు ఆకలిదప్పులతో కాశీకి చేరుకున్నారట. అప్పుడు పాండవుల ఆకలి తీర్చేందుకు ఏం చేయాలో తెలియక ద్రౌపది సూర్య భగవానుడి మూర్తిని ప్రతిష్టించి పూజించిందట. దీంతో పాండవులకు సూర్య భగవానుడు ఆకలి తీర్చాడట. ధర్మరాజు సూర్య భగవానుడిని పూజించి అక్షయ పాత్రను వరంగా పొందాడని కాశీ ఖండం చెబుతోంది. ద్రౌపది ప్రతిష్టించింది కాబట్టి ఈ సూర్య భగవానుడికి ద్రౌపదాదిత్యుడని పేరు. ఇక ఈ స్వామివారిని దర్శించుకుని పూజస్తే మనకు ఆకలిదప్పులనేవే ఉండవట.
