ఈ నల్ల హనుమంతుడిని దర్శించుకుంటే ఏలిన నాటి శని బాధలుండవట..

ఎక్కడి హనుమంతుడైనా ఎలా ఉంటాడు? కాషాయం రంగులో ఉంటాడు. అలాంటిది ఈ ఆలయంలో మాత్రం నల్లగా ఉంటాడు. అలాగే తూర్పు ముఖంగా ఉండి పూజలందుకుంటాడు. అసలు ఈ ఆలయం ఎక్కడుంది? దీని ప్రత్యేకతేంటి? అసలు హనుమంతుడు ఎందుకు నల్లని రంగులో ఉన్నాడు? వంటి విషయాలను తెలుసుకుందాం. జైపూర్‌లోని హవా మహల్ సమీపంలో ఈ నల్ల హనుమంతుడి ఆలయం ఉంది. వాయు పురాణం ప్రకారం సూర్యుని వద్ద హనుమంతుడు విద్యలను అభ్యసించాడు. విద్యాభ్యాసం పూర్తయ్యాక గురుదక్షిణగా ఏమి ఇవ్వాలో కోరుకోమని సూర్యుడిని హనుమంతుడు అడిగాడట.

తన కుమారుడు శనీశ్వరుడు తన మాట వినకుండా తనను విడిచి వెళ్లాడని అతనిని తిరిగి తీసుకురావాలని.. అదే తనకు చెల్లించే గురు దక్షిణ అని హనుమకు సూర్యుడు చెప్పాడట. శనీశ్వరుడి వద్దకు వెల్లిన హనుమ అతని తండ్రి దగ్గరకు తిరిగి రావాలని కోరాడట. తీవ్ర కోపంతో శనీశ్వరుడు.. హనుమంతుడిని చూడటంతో ఆయన నల్లగా మారిపోయాడట. అయినా సరే వదలకుండా శనీశ్వరుడిని ఒప్పించి సూర్యుని వద్దకు హనుమంతుడు తీసుకెళ్లాడట. అప్పుడు హనుమంతుడిని కార్యదీక్షకు సంతోషించిన శనీశ్వరుడు హనుమంతుడిని శనివారం పూజించిన వారికి శని బాధలుండవని వరం ఇచ్చాడట. కాబట్టి శనివారం హనుమకు 11 ప్రదక్షిణలు చేస్తే ఏలిన నాటి శని బాధలుండవని విశ్వాసం. అలాగే అనారోగ్య సమస్యలు సైతం దూరమవుతాయట.

Share this post with your friends