భగవద్గీత హిందువుల పవిత్ర గ్రంథమే కాదు.. దీనిని చదివితే మానవుల సమస్త సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెబుతారు. భగవద్గీత అనేది కురుక్షేత్ర సంగ్రామంలో తన వారితోనే యుద్దం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసినదే గీతోపదేశం. ధర్మం, కర్మ, మనసు నియంత్రణ వంటి వాటన్నింటికీ దీనిలో సమాధానాలుంటాయి. మనిషిని లోపల నుంచి మార్చే శక్తి కలిగిన గ్రంథమే భగవద్గీత. భగవద్గీతలోని కొన్ని వాక్యాలను చదివితే అవి మనలో ధైర్యాన్ని, నమ్మకాన్ని పెంచడంతో పాటు జీవితానికి సంబంధించిన ఎన్నో సత్యాలను వివరిస్తాయి.
“బ్రహ్మ స్వభావమే నిజమైన జ్ఞానం” ఆత్మ స్వరూపాన్ని తెలుసుకోవడమే అసలైన సత్య జ్ఞానం. “క్రియ లేకుండా ఫలితాలు రావు” ఏ పనీ చేయకుండా ఫలితాల కోసం ఎదురు చూడటం వలన ప్రయోజనం ఉండదు. “తన చర్యలలో సమతుల్యత కలిగినవాడు యోగి” ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా సమతుల్యతను కాపాడుకోవాలి. అలాంటి వ్యక్తి యోగి అవుతాడు. “మంచి పనులు ఫలితాన్నిస్తాయి” ఏ ఒక్క మంచి పని కూడా వృథా కాదు. ఏనాటికైనా సత్ఫలితాన్నిస్తాయి. “దుఃఖం ఆనందం తాత్కాలికం”.. దు:ఖం, ఆనందం రెండూ ఎప్పుడూ శాశ్వతమైనవి కావు. కాబట్టి మానవుడు ఈ రెండింటినీ సమానంగా స్వీకరించాలి.