తిరుమలలో కొనసాగుతున్న యాత్రికుల రద్దీ.. శ్రీవారి దర్శనం కోసం 24 గంటలు

తిరుమలలో గత మూడు రోజులుగా కొనసాగుతున్న భక్తుల రద్దీ, ఆదివారం కూడా ఔటర్ రింగ్ రోడ్డు లోని అక్టోపస్ వద్ద నుండి క్యూ లైన్లు కొనసాగుతున్నాయి. వేసవి సెలవులతో పాటు వారాంతపు రద్దీతో దేశం నలుమూలల నుండి తిరుమలకు వచ్చిన భక్తులతో పోటెత్తింది. దేశవ్యాప్తంగా విద్యార్థులకు దాదాపు అన్ని పరీక్షలు పూర్తయినందున సాధారణంగా మే నెలలో అధిక రద్దీ ఉంటుంది. ఇందులో భాగంగా వేసవి సెలవుల రద్దీ శుక్ర, శని, ఆదివారాలలో గరిష్ట స్థాయికి చేరుకుంది. టిటిడి ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి ఆదేశాల మేరకు, జేఈవో శ్రీ వీరబ్రహ్మం ఆధ్వర్యంలో ఇంజినీరింగ్‌, ఆరోగ్యం, అన్నప్రసాదం, విజిలెన్స్‌, వైద్య శాఖల ఉన్నతాధికారులు భక్తుల సౌకర్యాలను, క్యూ లైన్లను నిరంతరాయంగా పర్యవేక్షిస్తున్నారు.

మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, తిరుమలలోని అన్న ప్రసాద కౌంటర్లు, నారాయణగిరి ఉద్యానవనాలలో పాటు భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలలో ఆహారం, పాలు, త్రాగు నీరు అందించేందుకు టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. శ్రీవారి సేవకులు అన్నప్రసాదం, ఆరోగ్య, విజిలెన్స్ విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని కీలక ప్రదేశాల్లో దాదాపు 1500 మంది 24/7 సేవలందిస్తున్నారు. కృష్ణ తేజ సర్కిల్ వరకు వివిధ ప్రాంతాలలో నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు పంపిణీ చేస్తున్నారు. వైద్యబృందాలు బ్యాటరీ వాహనాల ద్వారా భక్తులకు అవసరమైన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను సరఫరా చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటల నివేదికల ప్రకారం ఆక్టోపస్ సర్కిల్‌లో లైన్‌లోకి ప్రవేశించే భక్తులకు దాదాపు 24 గంటల సమయం పడుతోంది.

Share this post with your friends