విభూతి ధారణ ఎలా చేయాలి ? ఎప్పుడు చేయాలి ?

విభూతిని పెట్టుకోవడాన్ని గురించి దాని ప్రభావాన్ని గురించి మనకి శివపురాణం వివరిస్తుంది. విభూతి పెట్టుకొని, రుద్రాక్షలను ధరించి, బిల్వదళాలతో శివారాధన చేయమని వివరిస్తుంది. ఎందుకు ఆ విధంగా చేయాలి ? విభూతిని పెట్టుకోకపోతే ఏమవుతుంది అనే విషయాలని శివపురాణంలో చర్చించడం జరిగింది.

వినా భస్మత్రిపుండేన వినా రుద్రాక్షమాలయా
బిల్వపత్రం వినానైవ పూజయేచ్ఛం కరం బుధః!!

పూజ చేసుకోవడానికి పూజామందిరం లోకి వెళ్లేప్పుడు పవిత్రంగా ఉండడం అవసరం. అందుకే మనం చక్కగా స్నానాన్ని ఆచరించిన తర్వాతే, పూజా మందిరంలోకి వెళ్లాలని శ్రుతులు చెబుతున్నాయి. అలా పూజ చేసుకునేప్పుడు మనసు మనం చేసే పూజపైన నిలబడాలి. ఏకాగ్రతని పొందాలంటే, భస్మధారణ, రుద్రాక్ష మాల , బిల్వదళార్చన చేయాలని శివ పురాణం చెబుతోంది.

భస్మము అంటే, బూడిదే కదా ! దానిని మూడు గీతలుగా నుదుటిపైన పెట్టుకోకుండా పూజ చేయవద్దు. శివలింగం మీద ఆజ్ఞాచక్రం మీద బొటనవేలితో బొట్టుపెట్టే అధికారం ఒక్క గురువుకు మాత్రమే ఉంటుంది. స్త్రీలయినా, పురుషులయినా లలాటమునందు విభూతిని మూడు గీతలుగా మాత్రమే పెట్టుకోవాలి. విభూతిని పెట్టుకోకుండా ఉండరాదు. రుద్రాక్షమాల వేసుకోకుండా పూజ చేయరాదు. బిల్వపత్రం లేకుండా పూజ చేయడం అంత మంచిది కాదు. బిల్వపత్రములను కొన్ని రోజులపాటు నిల్వచేసి పూజ చేసుకోవచ్చు. ఇలా ఈ మూడింటితో పూజ చేయాలని పండితులయిన వారు జ్ఞానమున్న వారు భక్తి కలిగిన వారు తాపత్రయపడుతూ ఉంటారు.

Share this post with your friends