
ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన వెంకన్నకు భారీగా హుండీ ఆదాయం సమకూరింది. శ్రావణ మాసం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు ద్వారకా తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. గడిచిన 27 రోజుల కాలానికి గాను హుండీ ఆదాయాన్ని కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆలయ అధికారులు నిన్న లెక్కించారు. స్వామివారికి 27 రోజులలో నగదు రూపంలో 2 కోట్ల 39 లక్షల 96 వేల 220 రూపాయల అధిక ఆదాయం లభించింది. బంగారం వచ్చేసి 145 గ్రాములు వెండి 6 కేజీల 19 గ్రాములు వచ్చినట్టు ఆలయ అధికారులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయం ఒకటి. దీనిని భక్తులు చిన్న తిరుపతిగానూ.. శ్రీ వేంకటేశ్వర స్వామివారిని చిన వెంకన్నగానూ పిలుస్తుంటారు. తిరుమలకు వెళ్లి మొక్కులు చెల్లించలేని వారు ఇక్కడి స్వామివారికి మొక్కులు చెల్లంచుకుంటూ ఉంటారు. ఇక్కడ మొక్కు తీర్చుకున్నా కూడా తిరుమల శ్రీమలయప్ప స్వామివారికి మొక్కు చేరుతుందని నమ్మకం. ప్రతి నిత్యం వేలాది మంది భక్తులు చిన వెంకన్నను దర్శించుకుంటూ ఉంటారు. అ ఆలయంలో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఏడాదికి రెండు పర్యాయాలు స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. దీనికి కారణం లేకపోలేదు.. ఇక్కడి ఆలయ గర్భాలయంలో స్వామివారు ఇద్దరు ధ్రువమూర్తులుగా భక్తులకు దర్శనమిస్తారు.
