వైశాఖ మాసం శుక్ల పక్షం తృతీయ తిథిని అక్షయ తృతీయగా జరుపుకుంటారు. అంటే మరో నాలుగో రోజుల్లో మనం అక్షయ తృతీయను జరుపుకోబోతున్నాం. ఈ ఏడాది మే 10వ తేదీన అక్షయ తృతీయను జరుపుకోనున్నారు. ఈ రోజున బంగారం కొంటే కలిసొస్తుందని చాలా మంది నమ్మకం. అక్షయ తృతీయ విశిష్టతను గురించి పద్మపురాణం కొన్ని విషయాలను చెబుతోంది. విష్ణుమూర్తితో నారద మహర్షి.. అక్షయ తృతీయ రోజున చేసే పనులన్నీ సత్ఫలితాలను ఇస్తాయని.. వాటి ఫలాలు ఎన్నటికీ తరగవని చెప్పాడు. ముఖ్యంగా ఇవాళ లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు. కాబట్టి కొన్ని పనులకు దూరంగా ఉండాలి. అవేంటో చూద్దాం.
అక్షయ తృతీయ నాడు డబ్బును అప్పుగా ఇవ్వకూడదట. ఇలా చేయడం అశుభమని చెబుతారు. ఇంట్లోని సిరి సంపదలన్నీ మరొకరి దగ్గరకు వెళతాయట. అక్షయ తృతీయ రోజున బంగారం లేదా బంగారు ఆభరణాలను పోగొట్టుకోవడం అపశకునంగా భావిస్తారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం అక్షయ తృతీయ నాడు ఎలాంటి ఆర్థిక నష్టం జరగకుండా జాగ్రత్త పడాలి. అలాగే చీపురును లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారు. కాబట్టి సాయంత్రం వేళ చీపురుతో ఇంటిని ఊడ్చడం అశుభమని నమ్ముతారు. అలాగే సాయంకాలం వేళ గుమ్మం మీద కూర్చోకూడదట. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి తులసి ఆకులను సమర్పించకూడదు. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దొంగతనం, అబద్ధం లేదా జూదం మొదలైన తప్పులు అస్సలుచేయకూడదు. మాంసం, మద్యం, వెల్లుల్లి, ఉల్లిపాయలు మొదలైన వాటిని అక్షయతృతీయ రోజున వాడకూడదు.