
దేశంలో హనుమంతుడి ఆలయాలకు కొదువేం లేదు. ప్రతి గ్రామంలోనూ ఉంటుంది. అసలు ఎక్కడ రామ నామ స్మరణ జరిగినా అక్కడ హనుమంతుడు ఉంటాడని చెబుతారు. శ్రీరాముడికి ఆంజనేయుడు అంతటి గొప్ప భక్తుడు. ఆంజనేయ స్వామికి చెందిన ప్రముఖ ఆలయాల్లో అర్థగిరి ఆంజనేయుని ఆలయం ఒకటి. ఇది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉంది. ముఖ్యంగా కాణిపాకం వరసిద్ధి వినాయకుడి దర్శనానికి వెళ్లే వారంతా ఈ ఆలయాన్ని దర్శించుకుని రావచ్చు. ఎందుకంటే కాణిపాకం నుంచి కేవలం 13 కి.మీ దూరంలో ఈ ఆలయం ఉంటుంది.
కాణిపాకంకు దగ్గరలో అరగొండ అనే గ్రామం ఉంటుంది. ఈ గ్రామంలో ఉన్న కొండపై అర్ధగిరి ఆంజనేయస్వామి ఆలయం ఉంది. ఈ అర్థగిరి కొండ లేదంటే పర్వతాన్ని సంజీవని పర్వతం అని కూడా స్థానికులు పిలుస్తారు. చాలా మందికి ఈ క్షేత్రం గురించి పెద్దగా తెలియదు. తెలిసిన వారు ఈ ఆలయానికి వెళ్లకుండా తిరిగి రారు. ఈ ఆలయంలోని హనుమంతుడిని ప్రసన్నాంజనేయుడిగా భక్తులు పిలుచుకుంటారు. స్వామివారు అలానే ప్రసిద్దిగాంచారు. ఇక్కడి హనుమంతుడి విశిష్టత ఏంటంటే మిగిలిన ఆలయాల మాదిరిగా కాకుండా హనుమంతుడి విగ్రహం ఉత్తరం వైపునకు తిరిగి ఉంటుంది.
