వరాహస్వామి బండరాయిలో వెలిసిందెక్కడో తెలుసా?

విష్ణుమూర్తి లోక సంరక్షణార్థం దశావతారాలను ఎత్తిన విషయం తెలిసిందే. దానిలో మూడవ అవతారం వరాహావతారం. ఈ వరాహావతారంలో జలయ ప్రళయంలో చిక్కుకున్న భూమండలాన్ని తన కోరలతో రక్షించాడని చెబుతారు. వరాహ అవతారాన్ని శ్రీ వరాహమూర్తిగా సంబోధిస్తారు. మహాలక్ష్మిని సంబోధించే శ్రీ పదాన్ని చేర్చుకుని శ్రీ వరాహమూర్తి అయ్యాడన్నమాట. కలియుగారంభంలో స్వామివారిని వెదుక్కుంటూ లక్ష్మీదేవి భూమిపైకి వచ్చిందట. అప్పుడు అమ్మవారికి వరాహస్వామి ఆశ్రయం ఇచ్చాడట. అందుకే తిరుమలలో ముందుగా వరాహస్వామిని దర్శించుకున్న మీదటే భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు.

ఇక ఈ వరాహస్వామి ఆలయం మన తెలంగాణలోనూ ఉంది. పెద్దపల్లి జిల్లా కమానపూర్ గ్రామంలో ఒక బండ రాయి పైన చిన్న ఎలుక ఆకారంలో స్వామి వెలిసాడు. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఇక్కడ స్వామివారి పాదాల ఆనవాళ్లను సైతం మనకు కనిపిస్తాయి. ఈ ఆలయ స్థల పురాణం మరింత ఆసక్తికరంగా ఉంటుంది. సుమారు 600 ఏళ్ల క్రితం ఒక మహర్షి తపస్సు చేయగా వరాహ స్వామి కలలో కనిపించి ఏమీ కావాలని అడిగాడట. ఇక్కడే కొలువై భక్తులకు ఎలాంటి ఆపదలూ రాకుండా చూడాలని స్వామివారిని మహర్షి కోరారట. ఆయన కోరిక మేరకు స్వామివారు బండరాయిలో వెలిశారని ప్రతీతి. ఇక్కడ ఆయనకు మందిరం కానీ గోపురం వంటివేమీ లేకుండా స్వామివారు ఆరుబయటే ఉంటారు.

Share this post with your friends