
పంచ కేదార్ ఆలయాల్లో ఒకటైన రుద్రనాథ్ గురించి తెలుసుకున్నాం కదా. సుముద్ర మట్టానికి దాదాపు 3,600 మీటర్ల ఎత్తులో ఈ ఆలయం ఉంటుంది. ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో రుద్రనాథుడు కొలువయ్యాడు. ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించారని చెబుతారు. ఈ ఆలయంలో శివుడు ప్రధాన దైవంగా ఉన్నాడు. ఆలయం వెలుపల ఎడమవైపున ఐదుగురు పాండవుల విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి. అలాగే పాండవుల తల్లి కుంతితో పాటు ద్రౌపది, అటవీ దేవతలు, వన దేవతల విగ్రహాలు మనకు కనిపిస్తాయి.
ఇక ఆలయానికి ఒకవైపు యక్ష దేవత లేదంటే జఖ్ దేవత ఆలయం ఉంటుంది. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ ఆలయంలో శివుని ముఖాన్ని పూజిస్తారు. ఈ ఆలయంలో ఎద్దు రూపంలో శివుని ముఖం కనిపించిందట. పంచ కేదార్లో మొదటిదైన కేదార్నాథుడి శరీరాన్ని పాండవులు చూశారట. రెండవ కేదార్గా మధ్య మహేశ్వరుడిని పిలుస్తారు. ఇక్కడి శివుని మధ్య భాగం కనిపిస్తుంది. తుంగనాథ్ శివుడిని మూడవ కేదార్గా పిలుస్తారు. ఇక్కడు శివుడి చేయి రూపం ఉంటుంది. ఇక రుద్రనాథ్ నాలుగవది. ఇక్కడ శివుని ముఖం కనిపిస్తుంది. కల్పేశ్వర్ను ఐదవ కేదార్గా భావిస్తారు. ఇక్కడ శివుని జుట్టు కనిపిస్తుంది.
