
పరమేశ్వరుడు సర్వవ్యాపి కనుక ఆయనకు ఆకారం ఉండదు. తాను ఇతరులకు దర్శనమివ్వాలనుకున్నప్పుడు పార్వతీమాతతో కలిసి దర్శనమిస్తుంటాడు. ఆ స్వామి రూపం లేని స్థితి నుంచి సాంబ మూర్తిగా దర్శనమివ్వడానికి మధ్యలో మరొక రూపం ఉంది. దానినే అరూపమని అంటారు. అదే శివలింగం. శివలింగాలు ఐదు రకాలు. తనంతట తానుగా అవతరించినది స్వయంభూలింగం. ధ్యానపూర్వకమైనది బిందు లింగం. మంత్రపూర్వకమైనది ప్రతిష్ఠాలింగం. నాలుగవది చర లింగం. ఐదవది శివుని విగ్రహమైన గురులింగం.
ఈ పవిత్ర భారతదేశంలో ప్రతి గ్రామంలోనూ ఓ శివాలయం ఉంటుంది. మనం కొన్నివేల శివలింగాలను దర్శించుకోవచ్చు. మరికొన్ని గ్రంథాలు శివలింగం రంగు, ఆకారం, కొలతలను అనుసరించి శివలింగాలను నాలుగు విధాలుగా పేర్కొంటున్నాయి. అవేంటంటే.. ఆఢ్యం, సురేఢ్యం, అనాఢ్యం, సర్వసమం. 1001 ముఖాలతో కనబడే శివలింగం ఆఢ్యం. 108 ముఖాలతో కనబడే శివలింగం సురే ఢ్యం. ప్రస్తుతం ఉన్నవి, లేనివి అన్ని శివలింగరూపాలను అనా ఢ్యం అంటున్నారు. ఒకటి నుంచి ఐదు ముఖాలు గల శివలింగాలు సర్వసమం.
