సుదర్శన చక్రం.. శ్రీ మహావిష్ణువు ఆయుధం. మహావిష్ణువు కుడి చేతితో సుదర్శన చక్రాన్ని పట్టుకొంటాడు. మిగిలిన మూడు చేతులతో శంఖం, గద, పద్మాన్ని ధరిస్తాడు. శ్రీమహావిష్ణువు సుదర్శన చక్రంతో అనేక మంది రాక్షసులను సంహరించాడు. ప్రస్తుతం జరుగుతున్న ఇండో-పాక్ యుద్ధంలో కూడా ఈ సుదర్శన చక్రమే దేశాన్ని కాపాడుతోంది. అయితే ఇప్పుడు భారత సైన్యం వినియోగిస్తున్న సుదర్శన చక్రం పేరు S-400. ఇదొక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. S-400 అనేది ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన వాయు రక్షణ వ్యవస్థలలో ఒకటి. ఇది రష్యాలో తయారైంది.
ఎంత దూరం నుంచైనా లక్ష్యాన్ని ఛేదించగలదు. డ్రోన్లు, క్షిపణులు, రాకెట్లు, యుద్ధ విమానాలను ఇట్టే కూల్చేస్తుంది. దీనికోసం 2018–19లో రష్యాతో ఇండియా ఒప్పందం చేసుకుంది. S-400.. శత్రు డ్రోన్లు, క్షిపణులు, రాకెట్లను 600 కిలోమీటర్ల దూరంలో ఉండగానే గుర్తిస్తుంది. 400 కి.మీ దూరంలో ఉండగానే దాడి చేస్తుంది. ఒకేసారి 80 టార్గెట్లు ట్రాక్ చేసి దాడి చేయగలదు. చైనా, పాకిస్తాన్ నుంచి వచ్చే వైమానిక ముప్పులను నివారిస్తుంది. దేశ వ్యాప్తంగా లేయర్డ్ ఎయిర్ డిఫెన్స్ను బలోపేతం చేస్తుంది. ఇప్పుడు భారతీయ గగనతలాన్ని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వాయు రక్షణ కవచాలలో ఒకటి కాపాడుతోంది. అందుకే S-400ను సుదర్శన చక్రంతో పోలుస్తున్నారు. దీనిని వదిలితే శత్రువుల డ్రోన్లు, క్షిపణులు, రాకెట్లను మట్టి కరిపిస్తుంది.