శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు ప్రారంభం

శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీవారి సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు రేపటి నుంచి అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాలు రేపటి నుంచి మూడు రోజుల పాటు అంటే 12వ తేదీ వరకూ జరుగనున్నాయి. ఇందులో భాగంగా మూడు రోజుల పాటు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. రేపు శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి శ్రీదేవి, భూదేవి సమేతుడై పెద్ద శేష వాహనంపై విహరించనున్నారు.

ఇక ఈ మూడు రోజుల పాటు స్వామివారికి వాహన సేవలు జరుగనున్నాయి. రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య వాహన సేవలను నిర్వహించనున్నారు. జూలై 11న హనుమంత వాహనం, జూలై 12న గరుడ వాహనంపై స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు. ఇక శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సాక్షాత్కార వైభవోత్సవాల మరుసటి రోజైన జూలై 13వ తేదీన పార్వేట ఉత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. శ్రీవారిమెట్టు సమీపంలోని మండపంలో ఉదయం 7 నుంచి ఈ ఉత్సవం నిర్వహిస్తారు.

Share this post with your friends