తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీసుందరరాజస్వామివారి అవతార మహోత్సవాలు జూన్ 27 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవి జూన్ 29 వరకూ అత్యంత వైభవంగా జరుగనున్నాయి. ఈ మూడు రోజుల పాటు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 గంటల వరకు శ్రీ కృష్ణస్వామి ముఖ మండపంలో శ్రీ సుందరరాజ స్వామివారికి వైభవంగా అభిషేకం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఉత్సవర్లకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేస్తారు.
అనంతరం సాయంత్రం 5.45 నుంచి 6.15 గంటల వరకు శ్రీ సుందరరాజస్వామివారికి ఊంజల్ సేవ జరుగుతుంది. రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకూ స్వామివారి వాహన సేవ నిర్వహిస్తారు. శ్రీసుందరరాజస్వామివారు మొదటి రోజు పెద్దశేష వాహనం, రెండో రోజు హనుమంత వాహనం, చివరి రోజు గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఉత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు శ్రీ పద్మావతి అమ్మవారి ఊంజల్ సేవను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది.